భారత్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్: మోడీతో భేటీ, కీలక ఒప్పందాలు, ఎస్-400
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం(డిసెంబర్ 6)నాడు భారత పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా ఈ భేటీ జరుగనుంది.
మోడీ-పుతిన్లు సోమవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉభయ దేశాల మధ్య 10 కీలక ఒప్పందాలపై సంతకాలు పెట్టే అవకాశం ఉంది. రక్షణ, పర్యావరణ మార్పులు, వాణిజ్యం సహా ఇతర రంగాలకు చెందిన 10 ఒప్పందాలపై సంతకాలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇరు దేశాల రక్షణ శాఖ, విదేశాంగ వ్యవహారాల మంత్రులు కూడా సోమవారం ముఖాముఖిగా సమావేశం కానున్నారు.
ద్వైపాక్షిక సదస్సుతో పాటు ఉభయ దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నారు. భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ S-400ను మరింత వేగంగా అందించాలని భారత్ .. రష్యాను కోరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు రక్షణ రంగంలో పెట్టుబడులు, ఆయుధాల కొనుగోలులో చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్నాయి. వీటిని మరింత పెంచుకోనున్నారు. ఇందులో భాగంగానే అమేఠీ సమీపంలోని కోర్వాలో 5 వేల కోట్ల రూపాయలతో సంయుక్తంగా నెలకొల్పిన ఫ్యాక్టరీలో 5లక్షల ఏకే-230 రైఫిళ్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.
సైన్యం కోసం రెండు ఇంజిన్ల 226T హెలికాప్టర్లను సంయుక్తంగా తయారు చేయాలని కూడా నిర్ణయించనున్నారు. మోదీతో భేటీ తర్వాత మంగళవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు పుతిన్ రష్యాకు తిరుగు పయనమవుతారు. ఇక పుతిన్ గౌరవార్థం మోడీ విందు ఇవ్వనున్నారు. భారత్-రష్యా మధ్య ఇప్పటికే 20 సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది భారత్లో జరగాల్సిన ఈ సదస్సు.. కరోనా కారణంగా నేటికి వాయిదా పడింది.
Recommended Video
ప్రస్తుతం భారత్, చైనా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది లడఖ్లో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత, రెండు దేశాలు తమ సైనిక బలంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో, భారతదేశం రష్యా నుంచి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీ అలాగే అనేక రక్షణ ఒప్పందాల గురించి ఇప్పుడు ప్రధాని మోడీ పుతిన్తో మాట్లాడవచ్చు. భారతదేశం ఫ్రాన్స్, ఇజ్రాయెల్తో సహా అనేక దేశాల నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తుంది.