సీన్లోకి 'జూ.ఎన్టీఆర్'! ': రేవత్ రెడ్డి టార్గెట్ హరీష్ రావు
హైదరాబాద్/ముంబై: తెలంగాణ రాష్ట్ర శాసన సభ వాడిగావేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. ఒకరి పైన మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బుధవారం హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరు వీరి మాటల యుద్ధంలో తెరపైకి వచ్చింది. తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. హరీష్ రావు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి జనియర్ ఎన్టీఆర్ ఉదంతాన్ని ప్రస్తావించారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, నిజామాబాద్లలో సమగ్ర సర్వేలో పాల్గొన్నారని, దాని పైన ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రేవంత్ మంగళవారం నాడు అధికార పార్టీని సభలో నిలదీశారు.
దీని పైన తెరాస బుధవారం స్పందించింది. కవిత రెండుచోట్ల వివరాలు ఇవ్వలేదని, దీని పైన రేవంత్ క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే బడ్జెట్ పైన టీడీపీ సభ్యులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అయితే, తమ వద్ద పత్రికల్లో వచ్చిన ఆధారాలు ఉన్నాయని, తమ ప్రశ్నకు మొదట అధికార పక్షం సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇరుపార్టీల మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీంతో సభ గురువారానికి వాయిదా పడింది.
ఇదిలా ఉండగా, మంగళవారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పీఠం హరీష్ రావుకు ఇస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇది హరీష్ రావుకు ఆగ్రహం తెప్పించింది. దీని పైన బుధవారంతీవ్రంగా స్పందించారు. రేవంత్ ఇష్టారీతిగా మాట్లాడవద్దని, తన తనయుడి కోసం చంద్రబాబు హీరో జూనియర్ ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి రాకుండా చేశారని కౌంటర్ ఇచ్చారు.
దీని పైన టీడీపీ నేతలు కూడా అంతే ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో తమ పార్టీ యువనేత నారా లోకేష్కు లింక్ పెట్టవద్దని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హరీష్ రావుతోనే ముప్పు ఉందని వారు వ్యాఖ్యానించారు. దీంతో, రేపు కూడా సభ వాడిగావేడిగా జరగనుందని భావిస్తున్నారు.