బీజేపీ ఆఫర్ ఇది: సీఎం పదవి లేదా రాజ్యసభ.. త్రిపుర కాంగ్రెస్ నేత ప్రద్యోత్ మాణిక్య వెల్లడి
అగర్తల: త్రిపుర రాజ వంశ వారసుడైన ప్రద్యోత్ మాణిక్య తనను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ శత విధాల ప్రయత్నించిందని ఆరోపించారు. బీజేపీలో చేరితే సీఎం పదవి కట్టబెడతామని ఆఫర్ ఇచ్చిందన్నారు. ఒకవేళ గెలుపొందకపోతే రాజ్యసభ సీటైనా ఇస్తామని, కానీ ప్రారంభ దశలోనే ఆ ఆఫర్ ను తోసిపుచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను లాగేసుకోవడానికి బీజేపీ ప్రయత్నించడం ఇదే మొదటి సారి కాదన్నారు. గతేడాది రెండుసార్లు కమలనాథులు ప్రయత్నించారని ఒక ఆంగ్ల టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రద్యోత్ మాణిక్య తెలిపారు.
తాను స్పష్టంగా తేల్చి చెప్పకపోవడంతో బీజేపీ త్రిపుర ఎన్నికల ఇన్ చార్జీ, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా స్పష్టమైన సంకేతాలిచ్చారని చెప్పారు. ఇంతకుముందు అసోంలో తరుణ్ గొగోయ్ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పని చేసిన హిమంత బిశ్వ శర్మ.. 2014 ఎన్నికల ముందు బీజేపీలో చేరిపోయారు.

పార్టీలను ధ్వంసం చేసిన నేతలతో పని చేయలేనన్న ప్రద్యోత్
అసోంలో.. తర్వాత ఈశాన్య భారతంలో బీజేపీ పుంజుకోవడానికి కారణమైన నేతల్లో హిమంత బిశ్వ శర్మ ఒకరు. హిమంత బిశ్వ శర్మతోపాటు పలువురు బీజేపీ నాయకులు తనను సంప్రదించారని ప్రద్యోత్ మాణిక్య తెలిపారు. బీజేపీ ఎన్నికల ఇన్ చార్జీ, అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల అగర్తలలోని తన ప్యాలెస్కు వచ్చి పలుకరించారని ప్రద్యోత్ మాణిక్య చెప్పారు. తన వంటి పెద్ద నేతలు బీజేపీలో చేరితే ప్రయోజనం ఉంటుందని సూచించారని తెలిపారు. కానీ తాను కాంగ్రెస్ పార్టీని ధ్వంసం చేసి త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో, త్రుణమూల్ పార్టీని ధ్వంసం చేసి బీజేపీలో చేరిన నేతలతో కలిసి పని చేయలేనని తేల్చి చెప్పానని ప్రద్యోత్ మాణిక్య చెప్పారు.

అవకాశ వాద రాజకీయాలకు నో చాన్స్
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అసాధారణ రీతిలో డబ్బులు ఖర్చు చేస్తున్నదని త్రిపుర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రద్యోత్ మాణిక్య దేవ్ వర్మ ఆరోపించారు. అయితే ఆ నిదులు స్థానిక వనరుల నుంచి సేకరించినవి కావన్నారు. బీజేపీ నేతలను కొనుగోలు చేస్తున్నదని ప్రద్యోత్ మాణిక్య ఆరోపించారు. 55 ఏళ్ల వయస్సులో నేతలు అకస్మాత్తుగా పార్టీలు మారడానికి ప్రత్యేక కారణమేమీ లేదన్నారు. బీజేపీ ఇస్తున్న డబ్బే ప్రదానమని, గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నదన్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసిన మొత్తం ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నదన్నారు. ఒకవేళ బీజేపీలో చేరిన నేతలు తిరిగి వస్తామంటే అవకాశ వాద రాజకీయాలకు తావు లేదన్నారు. అవినీతి పరులైన ఇటువంటి ఆయారాం, గయారాం నాయకులతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదన్నారు.

ఏడుగురు ఎమ్మెల్యేల చేరికతో బీజేపీలో కొత్తబలం
కానీ తన సిద్ధాంతాలతో, విశ్వసనీయతపై రాజీ పడేందుకు తాను సిద్దంగా లేనని ప్రద్యోత్ మాణిక్య స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతాలు, రాజకీయాలకు తనకు సరిపడవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్గం, ఆలోచనలతో తాను బాగానే ఉన్నానని ప్రద్యోత్ మాణిక్య చెప్పారు. అందువల్లే బీజేపీ ఆఫర్ తిరస్కరించానన్నారు.మరో మూడు రోజుల పోలింగ్ ముందు త్రిపురలో భారీ ఎత్తున విస్త్రుతంగా ఎన్నికల ప్రచారం సాగుతోందన్నారు. ఈ నెల 18న త్రిపురలో పోలింగ్ జరుగనున్నది. ప్రస్తుత ఎన్నికల్లో 60 స్థానాల త్రిపుర అసెంబ్లీలో అధికార సీపీఎంకు బీజేపీ ప్రధాన పోటీదారుగా నిలిచింది. 2013లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీలో చేరిపోయారు. మరి కొందరరు త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీలో సర్దుకున్నారు. ఎమ్మెల్యేలతోపాటు కొందరు ప్రముఖ కాంగ్రెస్ నేతలు సుదీప్ రాయ్ బర్మన్, రతన్ లాల్ నాథ్, దిలీప్ సర్కార్ వంటి వారు బీజేపీ గూటికి చేరుకోవడంతో కమలనాథులు బలం పుంజుకున్నారు.

త్రిపుర విభజనపై నోరు మెదపని బీజేపీ
నేతలంతా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ స్థానం బలహీన పడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ.. గిరిజన ప్రాంతాల్లో పట్టు గల ఐపీఎప్టీతో కలిసి బరిలోకి దిగుతున్నది. 51 స్థానాల్లో బీజేపీ పోటీలో ఉన్నది. ఐపీఎఫ్టీకి తొమ్మిది స్థానాలు కేటాయించింది. ఐపీఎఫ్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతుండగా, బీజేపీ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు బీజేపీలో నాయకులు చేరినా.. 2019లో కేంద్రంలో ప్రభుత్వం మారితే పరిస్థితి మారిపోతుందని ప్రద్యోత్ మాణిక్య స్పష్టం చేశారు. బీజేపీలో చేరిన నాయకులంతా తిరిగి వెనుకకు వచ్చేస్తారన్నారు. ఇప్పటికే చేరిన కొందరు నేతలకు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో బీజేపీ నుంచి వెనక్కు వచ్చే అంశాన్ని కొందరు పరిశీలిస్తున్నారన్నారు. అందువల్లే బీజేపీ 51 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నది. వారిలో 46 మంది మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలేనన్నారు. వారిని చేర్చుకున్నందుకు సాధ్యమైనంత త్వరలో బీజేపీ కూడా తన తప్పును తెలుసుకుంటుందన్నారు. అయినా వారంతా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చర్చలు జరుపుతున్నారని వివరించారు.

యువ రక్తానికి ప్రాధాన్యం ఇచ్చామన్న త్రిపుర కాంగ్రెస్ నేత
త్రుణమూల్ కాంగ్రెస్, బీజేపీల్లోకి కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా వలస వెళ్లినా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలకు కొదవ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడుతోందన్నారు. 1977 తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నదని ప్రద్యోత్ మాణిక్య వివరించారు. తమ అభ్యర్థుల్లో 26 మంది 45 ఏళ్లలోపు వారు ఉన్నారని, మరో 10 మంది 35 ఏళ్లలోపు వారన్నారు. నూతన కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం యువతకు అవకాశం ఇచ్చామన్నారు. తమ మనుగడను కాపాడుకోవడమే కాక తమ పునాదిని బలోపేతం చేసుకోవడానికి పోరాడుతున్నామన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలో జరిగిన భేటీలో త్రిపురతోపాటు ఈశాన్య భారతంలో పార్టీ పూర్వ వైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయనతో తన ఆలోచనను పంచుకున్నానన్నారు. రాహుల్ గాంధీ ఇతరుల ఆలోచనలను వినేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.

ఎన్నికలపై బీజేపీదీ అనవసరం హంగామా అని తేల్చేసిన ప్రద్యోత్
ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించి ఢిల్లీకి వెళ్లిపోతారని, కానీ తమకు త్రిపురపై స్పష్టమైన విజన్ ఉన్నదన్నారు. ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగ పురోభివ్రుద్ధిపై తమకూ ఒక మార్గదర్శక ప్రణాళిక ఉన్నదే గానీ, తాము పకోడీలు తయారు చేసి బతుకాల్సిన అవసరం లేదున్నారు. తమ విశ్వసనీయత తమకు ఉన్నదని స్పస్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హైప్ స్రుష్టిస్తూ అనవసర హంగామా చేస్తున్నదని ప్రద్యోత్ మాణిక్య చెప్పారు. హైప్ తప్ప అక్కడేమీ లేదన్నారు. మార్చి మూడో తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరెవరు ఉంటారో వేచి చూడండన్నారు. బయట నుంచి వచ్చిన వారంతా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోతారన్నారు. త్రిపురలో బీజేపీని సంస్థాగతంగా నిర్మించే ఆలోచనమీ లేదన్నారు. కష్ట పడితేనే ఎవరికైనా లబ్ధి చేకూరుతుందన్నారు. తాను అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రద్యోత్ మాణిక్య దేవ్ వర్మ తెలిపారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications