కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు అడ్డంకులేంటి..?
Recommended Video
కేరళలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. దేవ భూమిని అతలా కుతలం చేసేశాయి. ప్రకృతి పగబట్టినట్లుగా కేరళను కకావికలం చేసేసింది. అక్కడ కురిసిన భారీ వర్షాలకు చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పటికీ తమ వారి ఆచూకీ తెలియక బిక్కుబిక్కున ఎదురుచూస్తున్నారు చాలామంది. ఆకలితో అలమటిస్తూ సహాయం కోసం ఎదురుచూస్తున్న కేరళీయుల పరిస్థితి చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
కేరళలో వరదలు చేసిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే పినరాయి విజయన్ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ,ఇతర జాతీయ పార్టీలు కేరళలో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. దక్షిణ భారత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను చూపుతోందనే అపవాదు ఇప్పటికే మూటగట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. శనివారం కేరళలో పర్యటించిన ప్రధాని కంటితుడుపు చర్యగా రూ.500 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి కేరళకు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వరదలతో కేరళ ప్రజలు చాలా నష్టపోయారని.. వారిని వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు వెంటనే కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రాహుల్.
విపత్తు నిర్వహణ చట్టం 2005 ఏం చెబుతోంది..?
ఏదైనా మహా విపత్తు, లేదా ప్రమాదం ప్రకృతి వల్ల కానీ, మానవతప్పిదం వల్ల కానీ వచ్చి... భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగితే ఆ పరిస్థితిన అంచనా వేసి కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపత్తు నిర్వహణ చట్టం 2005 చెబుతోంది. భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగి పడటం, తుఫాను, సునామీ, హీట్ వేవ్లను ప్రకృతి పరంగా జరిగే నష్టాలుగా కేంద్రం స్పష్టం చేసింది. ఇక అణువిధ్వంసం, రసాయన దాడులను మానవుని ద్వారా సంభవిస్తాయని చట్టం చెబుతోంది. సహజ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని చట్టంలో ఎక్కడా లేదు. అయితే సహజ విపత్తు అంటే ఏమిటో స్పష్టంగా తెలపాలని 2001లో నాడు ప్రధానిగా ఉన్న వాజ్పేయి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సహజ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలో సూచించాలంటూ కమిటీకి చెప్పడం జరిగింది. అయితే కమిటీ ఎలాంటి సూచనలు చేయలేదు.
2001 గుజరాత్ భూకంపంపై కేంద్రం ఎలా రియాక్ట్ అయ్యింది..?
2001లో ఆనాటి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ 1999లో ఒడిషాను కుదిపేసిన వరదలు, 2001లో గుజరాత్లో సంభవించిన భూకంపాలను తీవ్రమైన విపత్తుగా పార్లమెంటులో ప్రకటించారు. అంతేకాదు 2013 ఉత్తరాఖండ్ వరదలు, 2014లో ఆంధ్ర ప్రదేశ్ హుద్హూద్ తుఫాన్లను, 2015 అస్సాం వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని చాలా మంది డిమాండ్ చేశారు. అయితే చట్టం ప్రకారం జాతీయ విపత్తుగా ప్రకటించడం జరిగితేనే అన్ని రకాల సహాయం అందుతుందని, వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏదైనా విపత్తు జరిగినప్పుడు దాని తీవ్రత ఎక్కువగా ఉంటే... ముందుగా ఆర్థిక సహాయం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభిస్తారని విపత్తు నిర్వహణ చట్టం 2005 చెబుతోంది.
కేంద్రం నిధులు ఎలా సమకూరుస్తుంది..?
విపత్తు తీవ్రత ఎక్కువగా ఉంటే కలామిటీ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని... అది సరిపోకపోతే జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుందని చట్టం చెబుతోంది. ఇదు విషయాలను కేంద్రం దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలకు కావాల్సినదంతా కేంద్ర సమకూర్చుతోంది. ఇందులో భాగంగానే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ దళాలను సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా కేంద్రం ఆదేశించింది తప్ప జాతీయ విపత్తుగా మాత్రం ప్రకటించేందుకు వెనకాడుతోంది.
జాతీయ విపత్తుగా ప్రకటించాలనడం రాజకీయ డిమాండ్ మాత్రమే
కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించినా అది కేవలం కాగితాల వరకే పరిమితం అవుతుందని... ప్రస్తుతం కేరళకు అన్ని విధాలా సహాయక చర్యలు, ఆర్థిక సాయం అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ఇకపై కూడా కేరళకు ఆర్థికంగా అండగా ఉండటమే కాకుండా అన్ని విధాలా ఆదుకుంటుందని చెబుతోంది. అమెరికాలో ఉండే వ్యవస్థ కంటే భారత్లో విపత్తు సమయాల్లో పనిచేసే యంత్రాంగం బాగా ఉందని కేంద్రం చెబుతోంది. రాష్ట్రం నుంచి తమకు మరింత బలగాలు కావాలంటే వెంటనే అక్కడకు కేంద్రం అదనపు బలగాలను పంపి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేరళ వరదలను జాతీయ విపత్తు ప్రకటించాలనేది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమేనని కేంద్రం తెలిపింది. ఇప్పటికే కేరళను ఆదుకునేందుకు కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేయడమే కాకుండా... పలు కేంద్ర ఏజెన్సీ సంస్థల నుంచి నిధులను విడుదల చేస్తోంది అని హోంశాఖ అధికారులు వెల్లడించారు.