మోడీకి రాహుల్ ఓపెన్ ఛాలెంజ్: ఇప్పటివరకు ఒక లెక్క-ఇకపై మరో లెక్క: ఆట మొదలైంది..!!
న్యూఢిల్లీ: దేశంలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు, జీఎస్టీ విధింపు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇక యుద్ధానికి తెర తీసింది. ఇవ్వాళ్టి నుంచే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలో 144 సెక్షన్ను కూడా విధించారంటే ఈ ఆందోళనల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Recommended Video


మోడీ సర్కార్పై..
దీనికి ప్రారంభ సూచకంగా ఏఐసీసీ మాజీ అధినేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకున్నారు. ఘాటు వ్యాఖ్యలు సంధించారు. కేంద్ర ప్రభుత్వంతో అసలైన యుద్ధం మొదలైందని వ్యాఖ్యానించారు. మోడీ నియంతృత్వానికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అంపశయ్యపై ప్రజాస్వామ్యం..
శతాబ్దకాలంగా నిర్మిస్తూ వస్తోన్న ప్రజాస్వామ్యం అంపశయ్యపై చేరిందని, దాని మరణాన్ని మనం కళ్లారా చూస్తోన్నామని ధ్వజమెత్తారు. నలుగురైదుమంది కోసమే మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తోన్నారని మండిపడ్డారు. మన కళ్ల ముందే ప్రజాస్వామ్య విధ్వంసం యథేచ్ఛగా, ఇష్టానుసారంగా సాగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా గళమెత్తిన వారిని మోడీ నియంతృత్వ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తోందని విమర్శించారు. అరెస్టులతో జైలుపాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న సభ్యులను పార్లమెంట్ నుంచి తరిమికొడుతోందని చెప్పారు.

ధరల పెరుగుదల..
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడాన్ని రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతికి మోడీ ప్రభుత్వం కారణమైందని పేర్కొన్నారు. కలిసి మెలిసి జీవించే ప్రజల మధ్య చీలక తీసుకొచ్చిందని ఆరోపించారు. నలుగురైదుమంది కోసం 130 కోట్ల ప్రజల హక్కులను పణంగా పెడుతోందని విమర్శించారు. ఆ ఇద్దరు (అంబానీ-అదానీ) కోసం నియంత్రత్వంతో పని చేస్తోందని, కార్పొరేట్-ఆహార వస్తువులపై మధ్య ఉన్న జీఎస్టీ తేడాను ప్రస్తావించారు.

బీజేపీ-ఆర్ఎస్ఎస్ అదుపులో..
దేశం మొత్తం భారతీయ జనత పార్టీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదుపులో ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా విధులను నిర్వర్తించాల్సిన ఏజెన్సీలు బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఆదేశాలతో పని చేస్తోన్నాయని పేర్కొన్నారు. బీజేపీలో గానీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో గానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిపైనా ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను అధికారుల దాడులు చోటు చేసుకోలేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.

ఆర్థిక పరిజ్ఞానం శూన్యం..
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్పైనా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఆమెకు ఉన్న ఆర్థిక పరిజ్ఞానం శూన్యమని వ్యాఖ్యానించారు. రోజురోజుకూ క్షీణిస్తోన్న రూపాయి పతనంపై పార్లమెంట్లో ఆమె చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అన్నారు.ఆహార వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం వల్ల పేదలపై ఎలాంటి అదనపు భారం పడబోదని నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను తన మానాన తాను వదిలేసి- ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేయడానికే కేంద్రం పని చేస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications