12 జిల్లాల్లో ఖాతా తెరవని బిజెపి: ఏ ప్రాంతంలో ఎలా? ఇంతలా ఊహించలేదు: పాశ్వాన్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోర పరాజయం పాలైంది. పన్నెండు జిల్లాల్లో ఒక్క నియోజకవర్గంలోని బిజెపి లేదా దాని మిత్రపక్షాలు ఖాతా తెరవలేదు. ఎన్డీయే కూటమిలోని హెచ్ఏఎం 20 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది.
ఎన్డీయే కూటమి అన్ని ప్రాంతాల్లో వెనుకంజలో నిలిచింది. దాదాపు ఏ ఒక్క ప్రాంతంలోను ముందంజలో నిలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91 స్థానాలు గెలిచిన బిజెపి ఇప్పుడు 70 స్థానాలకు అటు ఇటు పడిపోయింది.
పాట్నా నగరంలో 14 నియోజకవర్గాలు ఉండగా... 11 స్థానాల్లో మహాకూటమి ముందంజలో ఉండగా, కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే బిజెపి ముందంజలో ఉంది.
ఏ ప్రాంతంలో ఎలా?
మగధ ప్రాంతంలో మహా కూటమి 18 స్థానాల్లో, బిజెపి 7 స్థానాల్లో, పూర్ణియాలో మహాకూటమి 14 స్థానాల్లో, బిజెపి 8 స్థానాల్లో, సరన్ ప్రాంతంలో మహాకూటమి 15 స్థానాల్లో, 7 స్థానాల్లో, భాగల్పూర్ ప్రాంతంలో మహాకూటమి 8 స్థానాల్లో, బిజెపి 4 స్థానాల్లో, మంగేర్ ప్రాంతంలో మహాకూటమి 17 స్థానాల్లో, బిజెపి కూటమి 5 స్థానాల్లో, దర్భంగా ప్రాంతంలో మహాకూటమి 22 స్థానాల్లో, బిజెపి కూటమి 7 స్థానాల్లో, కోసి ప్రాంతంలో మహాకూటమి 11 స్థానాల్లో, బిజెపి కూటమి 1 స్థానాల్లో, పాట్నా పరిసర ప్రాంతంలో మహాకూటమి 33 స్థానాలు, బిజెపి కూటమి 8 స్థానాల్లో ముందంజలో లేదా గెలవడం జరిగాయి.
మూడింట రెండొంతుల మెజార్టీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల మెజార్టీకి మహాకూటమి చేరువవుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మహాకూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఎన్నో అంచనాలతో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే కూటమి దారుణ పరాభవం మూటగట్టుకునేట్లు కనిపిస్తోంది.
నితీష్, లాలూలకు పాశ్వాన్ అభినందనలు
నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్లకు ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అభినందనలు తెలిపారు. మహాకూటమి ఇంతలా విజయం సాధిస్తుందని ఊహించలేదని చెప్పారు.
నితీషే ముఖ్యమంత్రి: లాలూ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యంపై లాలూ ప్రసాద్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. మహాకూటమిలో ఎక్కువ స్థానాలు ఆర్జేడీ గెలిచినా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.