బీజేపీకి మేమే దిక్కు: మా మీద ఆధారపడాల్సిందే: మేమెవరితోనైనా కలవొచ్చు: శివసేన సరికొత్త ట్విస్ట్..!
ముంబై: మహారాష్ట్ర, హర్యానాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. రెండు రాష్ట్రాల ఫలితాలు ఒకేసారి వెలువడ్డాయి. ఈ రెండు చోట్లా ఒకే తరహా ఎన్నికల వాతావరణం నెలకొంది. అయినప్పటికీ..ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటైంది. భారతీయ జనతాపార్టీ-జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ) కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, ఉప ముఖ్యమంత్రిగా జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ.. మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వం ఏర్పాటులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
రోజులు గడుస్తున్నాయే గానీ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్ఠంభన కొనసాగుతూనే వస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ అటు బీజేపీకి లేదు.. ఇటు మిత్రపక్షం శివసేనకూ రాలేదు. సీట్లను సర్దుబాటు చేసుకుని. ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో- ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ రెండూ కలిస్తే అధికారంలోకి రావడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అందుతుంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన నేపథ్యంలో శివసేన విధించిన షరతులకు బీజేపీ అంగీకరించట్లేదు. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడుతోంది.

ఇదే విషయాన్ని శివసేన సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ను ప్రశ్నించగా.. ఆయన తమ ప్రమేయమేమీ లేదని అంటున్నారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దుష్యంత్ చౌతాలా సహకరించారని, ఆయన తండ్రి మొన్నటి దాకా తీహార్ జైలులో గడిపారని చెప్పారు. దుష్యంత్ చౌతాలా వంటి నాయకులెవరూ తమ పార్టీలో గానీ, మహారాష్ట్రలో గానీ లేరని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని అందుకోవాలని తాము తాపత్రయ పడట్లేదని చెప్పారు. తాము బీజేపీ మీద ఆధారపడి లేమని, తమ ప్రత్యామ్నాయ పార్టీలు తమకు ఉన్నాయని అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయమే లేదని అన్నారు. అయినప్పటికీ.. తాము బీజేపీని వదిలి వెళ్లాలని అనుకోవట్లేదని ట్విస్ట్ ఇచ్చారు.
కాంగ్రెస్, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను దృష్టిలో ఉంచుకుని సంజయ్ రౌత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కలిస్తే.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని సులువుగా ఏర్పాటు చేయగలవు. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 సీట్లు అవసరం అవుతాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే మేజిక్ ఫిగర్ ను అందుకోగలుగుతాయి. ఈ ఉద్దేశంతోనే తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయంటూ సంజయ్ రౌత్ స్పష్టం చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications