దేశాన్ని వెంటాడుతోన్న వ్యాక్సిన్ కొరత: మోడీ సర్కార్ ఏం చేస్తోంది?: సీరమ్ ఏం చెబుతోంది?
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వీర విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోసారి మూడున్నర లక్షలకు పైగా రోజువారీ కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడువేలకు పైగా మరణాలు వెలుగులోకి వచ్చాయి. గత రెండురోజుల్లో నమోదైన కేసులతో పోల్చుకుంటే.. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గిందే తప్ప- వేగం మాత్రం తగ్గలేదు. కొత్తగా 3,68,147 కేసులు దేశంలో నమోదయ్యాయి. 3,417 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 34,13,642లు రికార్డయ్యాయి.
మూడోదశకు వ్యాక్సిన కొరత
ఈ పరిస్థితులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. మూడోదశను కూడా ప్రారంభించింది. ఈ నెల 1వ తేదీ నుంచి మూడోదశ వ్యాక్సిన్ ఆరంభమైంది. ఈ దశలో 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. వ్యాక్సిన్ కొరత ఉన్నందున పలు రాష్ట్రాలు మూడోదశ టీకా కార్యక్రమాన్ని చేపట్టలేకపోతోన్నాయి. ఏపీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు కేంద్రం మూడోదశను ప్రారంభించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్త ఆర్డర్లు ఇవ్వట్లేదంటూ వార్తలు..
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సమీకరించట్లేదని, టీకాల కోసం ఉత్పాదక సంస్థలకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వట్లేదంటూ వార్తలు వెలువడుతున్నాయి. టీకాలను కొనుగోలు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించి.. తాను చేతులు దులుపుకొందంటూ వరుస కథనాలు ప్రచురితమౌతున్నాయి. వాటిపట్ల సీరమ్ ఇన్స్టిట్యూట్ స్పందించింది. ఆ వార్తలు వాస్తవం కాదని తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమను సంప్రదిస్తూనే ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు సీరమ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
సీరమ్ ఏం చెబుతోంది?
11 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం కిందటి నెల 28వ తేదీన ఆర్డర్ ఇచ్చిందని సీరమ్ తెలిపింది. దీనికోసం వందశాతం అడ్వాన్స్గా 1,732.50 కోట్ల రూపాయలను విడుదల చేసిందని పేర్కొంది. వచ్చే మూడు నెలలు అంటే- మే, జూన్, జులైల్లో వినియోగించడానికి వీలుగా ముందుగానే 11 కోట్ల డోసుల టీకాలను ఆర్డర్ ఇచ్చిందని వివరించింది. దీనితోపాటు- కిందటి నెల 28వ తేదీ నాడే కోవాగ్జిన్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్ సంస్థకు 787.50 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలిపింది. ఈ మొత్తంతో అయిదు కోట్ల కోవాగ్జిన్ డోసులను కేంద్రం కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది.
రాష్ట్రాల వద్ద రిజర్వ్..
ఈ నెల 2వ తేదీన అంటే ఆదివారం నాటికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 16.54 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉచితంగా పంపిణీ చేసిందని, 78 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇంకా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. దీనికి అదనంగా మరో మూడు రోజుల్లో 56 లక్షల డోసుల వ్యాక్సిన్లు రాష్ట్రాలకు పంపిస్తామని తేల్చి చెప్పింది సీరమ్ ఇన్స్టిట్యూట్. వ్యాక్సిన్ కోసం కేంద్రం టీకా ఉత్పాదక సంస్థలకు ఎలాంటి కొత్త ఆర్డర్లను ఇవ్వట్లేదంటూ వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైనవని వివరించింది.