నల్ల జెండాలు చూపిస్తాం: మోడీపై ఎండిఎంకె నేత వైగో, ఏపి సిఎంపైనా..
చెన్నై/న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన ప్రధాని నరేంద్ర మోడీని తమిళనాడుకు వస్తే నల్లజెండాలను చూపిస్తామని ఎండిఎంకె నేత వైగో చెప్పారు. శ్రీలంకలో వేలాది మంది తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సే తిరుమలకు వస్తే రాచమర్యాదలు చేయడాన్ని ఆయన విమర్శించారు.
రాజపక్సే తిరుపతికి రావడానికి మోడీ కూడా ఒక కారణమని అన్నారు. రాజపక్సే తిరుమలకు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా అడ్డుకుని ఉండాల్సిందని వైగో అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో అక్కడి తమిళులు నిర్మించుకున్న 1500 ఆలయాలను రాజపక్సే ధ్వంసం చేయించాడని ఆరోపించారు.

తమిళ మీడియా ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నందునే అధికార ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగామని వైగో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళులు నిరసన వ్యక్తం చేయబోరని, మోడీ ఎదుట మాత్రమే నిరసన తెలుపుతారని అన్నారు.
మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్న లంక అధ్యక్షుడు రాజపక్సే బుధవారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాగా, మంగళవారం వందలాది మంది తమిళులు రాజపక్సేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తమిళ మీడియా ప్రతినిధులను కూడా ఏపి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎండిఎంకె శ్రేణులను విడుదల చేయమని అడగడం లేదని, తమిళ మీడియా ప్రతినిధులను విడుదల చేయాలని కోరుతున్నామని చెప్పారు. అతిగా ప్రవర్తించిన ఏపి పోలీసులపై చర్యలు తీసుకోవాలని వైగో డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications