తెల్లారేసరికి విగతజీవుల్లా!: పెళ్లి మిగిల్చిన విషాదం.. అసలేం జరిగింది?
ఆదివారం ఉదయం నిద్రలేచిన హరిహర సుదన్ తల్లిదండ్రులు, చెల్లి బలవన్మరణానికి పాల్పడినట్టుగా గుర్తించాడు.
చెన్నై: పెళ్లిళ్ల రద్దు కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు సంఘటనలు చోటు చేసుకోగా.. తాజాగా తమిళనాడులోను ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
కుమార్తె పెళ్లి రద్దవడం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడగా.. అది చూసి కుమార్తె కూడా బలవన్మరణానికి పాల్పడింది. తమిళనాడులోని తిరుతురాయిపూండిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇదీ నేపథ్యం:
నగల వ్యాపారి గణేశన్(55), రజతి(50) దంపతులు. గణేశన్ అమ్మలూరులోని పిల్లయార్ కోయిల్ ప్రాంతంలో నగల తయారీ దుకాణం నడుతున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు రాజ్కుమార్, హరిహర సుదన్, కుమార్తె గీత (25) ఉన్నారు. రాజ్కుమార్ విదేశాల్లో పనిచేస్తుండగా.. అరిగరసుదన్ ఇంట్లోనే ఉంటున్నారు.

పెళ్లి కుదిరింది:
ఇటీవల కుమార్తె గీతకు పెళ్లి నిశ్చయమైంది.జనవరి 24, 2018న ముహూర్తం కూడా పెట్టుకున్నారు. దీంతో గణేశన్ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇంతలో రెండు రోజుల క్రితం వరుడి తరుపువారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు సమాచారం ఇవ్వడంతో గణేశన్ తట్టుకోలేకపోయాడు. ఆయన భార్య రజతి కూడా తీవ్రంగా కుమిలిపోయింది.

ముగ్గురి బలవన్మరణం:
ఆదివారం ఉదయం నిద్రలేచిన హరిహర సుదన్ తల్లిదండ్రులు, చెల్లి ఇంకా నిద్రలేకపోవడాన్ని గమనించాడు. వారి వద్దకు వెళ్లి పరిశీలించగా.. ముగ్గురు విగతజీవుల్లా కనిపించారు. మృతదేహాలను చూసి బోరున ఏడ్చాడు. గమనించిన స్థానికులు ఎడయూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సంఘటనా స్థలానికి చేరుకుని వారు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

పాలల్లో విషం:
రాత్రి పడుకునేముందు పాలల్లో విషం కలుపుకుని తాగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్షన్-174కింద అనుమానాస్పద మరణాలుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి రద్దు కావడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications