జుట్టుపట్టి ఈడ్చేయాల్సింది: మమతకు దిలీప్ క్షమాపణ
తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు చింతిస్తూ.. పశ్చిమబెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్షమాపణలు చెప్పారు.
కోల్కతా: తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు చింతిస్తూ.. పశ్చిమబెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలను నొప్పించడం తన ఉద్దేశం కాదని ఆయన తెలిపారు. తన వ్యాఖ్యలు గౌరవనీయులైన ముఖ్యమంత్రిని కించపరిచేలా ఉంటే అందుకు క్షమాపణలు చెప్పేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని ఘోష్ మీడియా సమావేశంలో చెప్పారు.
గత కొద్ది రోజులుగా సీఎం మమతపై ఘోష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆమె మతిస్థిమితం కోల్పోయారని, అందుకే ఢిల్లీ, పాట్నాల్లో తిరుగుతున్నారని అన్నారు. అంతేగాక, రెండ్రోజుల క్రితం.. తాము తలచుకుంటే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చి అవతల పడేసేవాళ్లమని.. ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జుట్టు పట్టి, ఈడ్చేయాల్సింది: మమతపై బిజెపి నేత తీవ్ర వ్యాఖ్యలు
ఘోష్ వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. నోట్ల రద్దుపై మమత చేస్తున్న పోరాటాన్ని ఎదుర్కొనలేక బిజెపి నేతలు ఇటువంటి దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని మండిపడింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించడం వారి కుసంస్కారానికి నిదర్శనమని పేర్కొంది. ఎన్ని విమర్శలెదురైనా.. పెద్దనోట్ల రద్దుపై మమత పోరాటం ఆగదని స్పష్టంచేసింది.