బెంగాల్ 'ఫైటర్' దీదీ ఘన విజయం వెనుక కారణాలివే... మమత హ్యాట్రిక్ కొట్టడంలో ఇవే కీలకం...
బెంగాల్లో దీదీ దుమ్ము రేపింది... 'ఫైటర్' అన్న పేరును సార్థకం చేసుకుంది... బీజేపీ ముప్పేట దాడి చేసినా అదరక బెదరక బరిగీసి నిలబడింది... బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డే పాలించాలని నినదించింది... మోదీ-అమిత్ షా ఔట్ సైడర్స్ అని... తాను పక్కా లోకల్ అని చెప్పడమే కాదు... బెంగాల్ ప్రజల్లోనూ అదే తీర్పు వ్యక్తమయ్యేలా చేసింది... ముచ్చటగా మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నది. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత సక్సెస్ వెనుక పనిచేసిన అంశాలేంటో ఒకసారి పరిశీలిద్దాం....

దీదీ... ఫైటర్ ఇమేజ్...
సునాయసంగా గెలిచే స్థానాన్ని వదిలి మమత నందిగ్రామ్ అసెంబ్లీ బరిలో దిగడం పెద్ద సాహసమే. దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయిన సువెందు అధికారి ప్రాబల్యాన్ని ఆమె ఢీకొట్టి నిలబడగలదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదయం నందిగ్రాం పోలింగ్ ట్రెండ్స్ వచ్చేటప్పటికీ... మమత అక్కడ గెలవడం కష్టమేనని చాలామంది భావించారు. మధ్యలో పుంజుకున్నప్పటికీ.. అంతిమంగా ఓటమి తప్పలేదు. అయితే నందిగ్రాంలో పోటీ దీదీకి కలిసొచ్చిందనే చెప్పాలి. ఒకవేళ దీదీ ఆత్మరక్షణ వ్యూహంలో భాగంగా నందిగ్రాంతో పాటు మరో చోటు నుంచి కూడా పోటీ చేసి ఉంటే.. ఆమెను ఓటమి భయం వెంటాడుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి ఉండేవి. అలా జరగకుండా... రిస్క్ అని తెలిసినా ఆమె నందిగ్రాంలో మాత్రమే పోటీ చేశారు. నందిగ్రాంలో మమత ఓడిపోవచ్చు గానీ బెంగాల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు ఆమె చేసిన రిస్క్ తోడ్పడిందని చెప్పక తప్పదు.

వన్ అండ్ ఓన్లీ సీఎం క్యాండిడేట్...
మమత బెనర్జీకి సమవుజ్జీగా,ధీటుగా నిలబడే ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీకి లేకపోవడం దీదీకి కలిసొచ్చిందని చెప్పాలి. బెంగాల్ సమకాలీన రాజకీయాల్లో దీదీ స్థాయి ఉన్న మరో బలమైన నేత ప్రతిపక్షాల్లో లేకపోవడం కూడా ఆమెకు కలిసొచ్చింది. దీదీ కాకుండా మరో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆప్షన్ ప్రజల ముందు లేదు. పైగా సింగూర్,నందిగ్రాం వంటి ప్రజా ఉద్యమాల్లో నుంచి ఎదిగొచ్చిన నేపథ్యం ఆమెది. బెంగాల్ గడ్డను బెంగాల్ బిడ్డనే పాలించాలన్న ఆమె నినాదానికి.. ఆమె గత రాజకీయ కార్యాచరణకు బ్యాలెన్స్ కుదిరింది.ఇన్సైడర్ Vs ఔట్సైడర్ అన్న నినాదం కూడా వర్కౌట్ అయింది. వాళ్లు వస్తారు పోతారు... కానీ మీరూ,నేనూ ఎప్పుడూ ఇక్కడే ఉంటాం మిత్రమా అంటూ బెంగాల్ ప్రజలకు మమత పదేపదే విజ్ఞప్తి చేస్తారు.

అన్ని వర్గాల మద్దతు...
బీజేపీ కేవలం హిందూ ఓటు బ్యాంకుపై ఆధారపడగా... దీదీ మాత్రం హిందూ,ముస్లింలతో పాటు ఇతర సామాజికవర్గాల ఓట్లపై ఫోకస్ చేసింది. తమ పార్టీకి అందరూ సమానమేనని ఎన్నికల వేదికలపై పదేపదే స్పష్టం చేసింది. ఒకానొక సమయంలో తాను హిందువునేనని... బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళను అని... కాబట్టి హిందూ ధర్మం గురించి తనకు ఎవరూ చెప్పే పని లేదని పేర్కొంది. తద్వారా హిందువుల్లోకి బలమైన సంకేతాలు పంపించగలిగింది. అలాగే రాష్ట్రంలో హిందూ,ముస్లింలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు... జై బంగ్లా నినాదంతో క్రిస్టియన్లు,జైన్లు,బుద్దిస్టులు,పార్సీలు,గిరిజన తెగకు చెందిన పూజారులకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలు అన్ని వర్గాల్లో మమత పట్ల సానుకూల వైఖరికి కారణమయ్యాయి.

ఆకట్టుకున్న సంక్షేమ పథకాలు..
సంక్షేమ పథకాల హామీలు కూడా దీదీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రంలో రూ.5కే భోజనం అందించే క్యాంటీన్ల ఏర్పాటు,పేదింటి ఆడబిడ్డల చదువులు,స్వయం ఉపాధికి నగదు ప్రోత్సాహకం,బిడ్డల పెళ్లిళ్లకు నగదు,అన్ని రకాల ఫించన్లు రూ.1వెయ్యికి పెంచడం తదితర పథకాలు దీదీ గెలుపుకు దోహదం చేశాయి. రాష్ట్రంలో 13-19ఏళ్ల వయసున్న బాలికల చదువులు,స్వయం ఉపాధికి ప్రభుత్వం తరుపున నగదు ప్రోత్సాహకం అందిస్తామని ఎన్నికల్లో దీదీ హామీ ఇచ్చారు. దీని ద్వారా 67,97,966 మంది బాలికలు లబ్ది పొందనున్నారు. రూపశ్రీ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.25వేలు ప్రభుత్వం తరుపున అందిస్తామని మమత హామీ ఇచ్చారు. దీని ద్వారా మొత్తం 8,49,138 మంది లబ్ది పొందనున్నారు. ఇక ఫించన్ల ద్వారా 23,16,058 మందికి లబ్ది చేకూరనుంది. ఈ పథకాల ద్వారా లబ్ది పొందే వర్గాలన్నీ ఎన్నికల్లో దీదీ వైపే నిలిచినట్లు ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications