మమతా వర్సెస్ మోడీ: నువ్వా-నేనా: ప్రారంభ ఫలితాల్లో టగ్ ఆఫ్ వార్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎవరు విజేతలు? ఎవరు పరాజితులనేది ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది. ఇక ఏపీలోని తిరుపతి లోక్సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు కూడా వాటితోపాటు వెల్లడి కానున్నాయి.
ఓట్ల లెక్కింపు సందర్భంగా అందరి కళ్లూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మీదే నిలిచాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ను ఓడించడానికి భారతీయ జనతాపార్టీ సర్వశక్తులనూ ఒడ్డటమే దీనికి కారణం. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఆ రాష్ట్ర అధికార పగ్గాలను అందుకున్నారు. వరుసగా మూడోసారి కూడా జెండా ఎగరేస్తారా? లేదా? అనేది ఈ మధ్యాహ్నానికి తేలిపోనుంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాలు నువ్వా-నేనా అనేలా సాగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతోండగా.. బీజేపీ దాని వెనుకే పరుగులు తీస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు ఏ పార్టీ వైపు కూడా మొగ్గు చూపలేదు. రెండు పార్టీలకూ పోటాపోటీగా ఓట్లు పడ్దాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో తృణమూల్ కాంగ్రెస్ 48 చోట్ల ఆధిక్యతను కనపరుస్తుండగా.. బీజేపీ 45 చోట్ల లీడింగ్లో కొనసాగుతోంది. సీపీఎం ఒక చోట ఆధిక్యతలో కనిపించింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఓటింగ్ కూడా దాదాపుగా ఇదే సరళిలో కొనసాగి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇదే ట్రెండ్ గనక ఈవీఎంల ఓట్ల లెక్కింపులోనూ కనిపిస్తే.. హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఈవీఎం ఓట్ల లెక్కింపులో ట్రెండ్ మారుతుందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ బలంగా వీస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహిస్తోన్నఓట్ల లెక్కింపు కావడం వల్ల కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల ముందుజాగ్రత్త చర్యలను చేపట్టింది. లెక్కింపు పూర్తయిన తరువాత గెలిచిన అభ్యర్థులు నిర్వహించే విజయోత్సవాలను నిషేధించింది. అలాగే- ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అభ్యర్థులను గానీ, వారి ఏజెంట్లను గానీ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.
Recommended Video