దాడి ఎఫెక్ట్: బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయాకు బుల్లెట్ ప్రూఫ్ కారు
కోల్కతా: ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై పశ్చిమబెంగాల్లో దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బీజేపీ జాతీయ కార్యదర్శి, బెంగాల్ పార్టీ ఇంఛార్జీగా ఉన్న కైలాశ్ విజయవర్గీయాకు బుల్లెట్ ప్రూఫ్ కారును ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మధురాపూర్లో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కల్పించినట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు డిసెంబర్ 10న జేపీ నడ్డా, కైలాశ్ వర్గీయా, తదితర పార్టీ నేతలు డైమండ్ హార్బర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలు, ఇటుకలతో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ ఘటనకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానిదే బాధ్యత అని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే, బీజేపీ ఆరోపణల్ని సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఖండించారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
దాడి ఘటనపై కైలాశ్ వర్గీయ మాట్లాడుతూ.. ఈ దాడిలో తనకు గాయాలైనట్లు తెలిపారు. తమ పార్టీ అధినేత కారు పైనా దాడికి పాల్పడ్డారని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే గూండాలు తమపై దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ దాడి సమయంలో తాము స్వదేశంలోనే ఉన్నామా? అనే సందేహం కలిగిందని కైలాశ్ వర్గీయా వ్యాఖ్యానించారు.
కాగా, బీజేపీ కీలక నేతలపై దాడులు జరగడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎస్, డీజీపీకి కేంద్రం సమన్లు జారీ చేసింది. ఈ దాడి ఘటనపై దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.












Click it and Unblock the Notifications