నేనూ బొద్దింకనే.. రాత్రికి రాత్రే కొత్త పార్టీ..
సోషల్ మీడియా యుగంలో నిరసనలు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ధర్నాలు, రాస్తారోకోల కాలం దాటి.. డిజిటల్ ప్రపంచంలో సరికొత్త 'వ్యంగ్య అస్త్రాలు' పుట్టుకొస్తున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఒకే ఒక్క వ్యాఖ్య.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక డిజిటల్ రాజకీయ సునామీకి తెరలేపింది. 'మై భీ కాక్రోచ్' (నేను కూడా బొద్దింకనే) అనే నినాదంతో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఒక వినూత్న పార్టీ, ఇప్పుడు లక్షలాది మంది యువతను ఆకర్షిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఏంటా కథ? అసలు ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వెనుక ఉన్న అసలు కథేంటో చదివేయండి!
ఈ సరికొత్త ఆన్లైన్ ఉద్యమానికి పునాది మే 15న పడింది. ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్.. నిరుద్యోగ యువతను ఉద్దేశించి "బొద్దింకలు (కాక్రోచెస్)" అని సంబోధించారంటూ సోషల్ మీడియాలో, కొన్ని వార్తా సంస్థల్లో ప్రచారం జరిగింది.

అయితే, ఈ వార్తలపై మరుసటి రోజే ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు. దేశ యువతను తాను ఎప్పుడూ గౌరవిస్తానని, వారు 'వికసిత భారతానికి మూలస్తంభాలు' అని ప్రశంసించారు. నకిలీ డిగ్రీలతో న్యాయవృత్తిని బ్రష్టుపట్టిస్తున్న కొందరు నకిలీ లాయర్లను ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని సీజేఐ క్లారిటీ ఇచ్చారు.
పుట్టుకొచ్చిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)
సీజేఐ వివరణ ఇచ్చేలోపే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ వ్యాఖ్యలకు వ్యంగ్య నిరసనగా మే 16న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆవిర్భవించింది. బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న, గతంలో ఆప్ (AAP) సోషల్ మీడియా వాలంటీర్గా పనిచేసిన 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే ఈ వినూత్న పార్టీని స్థాపించాడు.
పార్టీ ఐడియాలజీ ఏంటో తెలుసా?
ఈ పార్టీ తమ నినాదంగా 'సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ (సోమరి)' అని ప్రకటించుకుంది. "నిత్యం ఆన్లైన్లో ఉంటూ, సోమరిపోతులుగా ముద్రపడి, ఇటీవల బొద్దింకలు అని పిలవబడ్డ యువత కోసమే ఈ పార్టీ" అంటూ వ్యంగ్యంగా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.
కేవలం 3 రోజులు.. లక్షలాది మంది సభ్యులు!
ఈ డిజిటల్ నిరసన యువతను ఎంతగా ఆకట్టుకుందంటే, పార్టీ పెట్టిన కేవలం 48 గంటల్లోనే సొంతంగా వెబ్సైట్, ఒక పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు.
- సభ్యత్వాలు: పార్టీ ప్రారంభించిన 3 రోజుల్లోనే ఏకంగా లక్ష మందికి పైగా యువత ఇందులో డిజిటల్ సభ్యులుగా చేరారు.
- సోషల్ మీడియా క్రేజ్: ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మందికి పైగా, ఎక్స్ (ట్విట్టర్)లో 40 వేలకు పైగా ఫాలోవర్లతో ఈ పార్టీ అకౌంట్లు దూసుకుపోతున్నాయి.
ప్రముఖుల ఎంట్రీ.. కేవలం 'మీమ్' మాత్రమే కాదు!
ఈ వ్యంగ్య రాజకీయ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఫైర్ బ్రాండ్ లీడర్ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీలో సభ్యులుగా చేరడం విశేషం. మహువా మొయిత్రాను ఈ పార్టీ "ప్రజాస్వామ్య ఫైటర్"గా స్వాగతించింది.
అయితే, ఇది కేవలం నవ్వులాటకో, మీమ్స్ కోసమో పెట్టిన పార్టీ కాదని CJP నిరూపిస్తోంది. దేశంలో హాట్ టాపిక్గా మారిన 'నీట్ (NEET) పేపర్ లీకేజ్' అంశంపై స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం, సీబీఎస్ఈ (CBSE) రీచెక్కింగ్ ఫీజులను రద్దు చేయాలని కోరడం వంటి యువత సమస్యలపై ఈ వేదిక ద్వారా గళం విప్పుతున్నారు.
బాధ్యతాయుతమైన నిరసన!
భారత యువత అత్యంత అవగాహనతో ఉన్నారని, తమపై జరిగే అపహాస్యాన్ని, తమ అసంతృప్తిని హింసాత్మక మార్గాల్లో కాకుండా.. ఇలా అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, వ్యంగ్యంగా ప్రపంచానికి చాటిచెబుతున్నారని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నాడు. ఏది ఏమైనా, డిజిటల్ వేదికలపై యువత సృష్టిస్తున్న ఈ సరికొత్త 'పాలిటిక్స్' ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి.














Click it and Unblock the Notifications