బడ్జెట్ అక్కడే: నార్త్ బ్లాక్... అదో రహస్య ప్రపంచం
న్యూఢిల్లీ: 2016-17 సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పన అత్యంత రహస్యంగా, శరవేగంగా సాగుతోంది. దేశరాజధాని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ బేస్మెంట్లో ఉన్న ముద్రణా కార్యలయంలో ఎంపిక చేసిన కొందరు అధికారుల నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
అంతేకాదు నెట్వర్క్ లింకులు తొలగించబడిన కంప్యూటర్లపై ఈ పని సాగుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రతిపాదనలతో కూడిన బడ్జెట్కు సంబంధించిన సీడీ సోమవారం లేదా మంగళవారం ముద్రణకు రానుంది. ఇప్పటికే ప్రింటింగ్ పనిలో నిమగ్నమైన టెక్నాలజీ నిపుణులు, లీగల్ అధికారులు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు, నార్త్బ్లాక్లో పనిచేసే అధికారులు ఎవరూ బయటకు వెళ్లడానికి వీలు లేకుండా చేశారు.
కేంద్ర బడ్జెట్ తయారీలో పని చేసే ఉద్యోగులు సెల్ ఫోన్లు, మెయిల్స్, సామాజిక మాధ్యమాలు వినియోగించడం నిషేధం. అంతేకాదు బడ్జెట్ తయారీలో పాల్గొనే ఉద్యోగులు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉండదు. అయితే కొంతమంది అత్యున్నత స్థాయి ఉద్యోగులకు మాత్రం ఇంటికి వెళ్లే వెసులుబాటు ఉంది.
బడ్జెట్ తయారీలో పాల్గొనే ఉద్యోగులు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా విధుల్లో నిమగ్నమై ఉండే విషయం తెలిసిందే. అక్కడే తిని, అక్కడే విశ్రమించే వీరంతా ఆర్థికమంత్రి లోక్ సభ లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరమే బయటకు వస్తారు. కేంద్ర మంత్రివర్గ సహచరులకు ఈ బడ్జెట్ ప్రతులు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే అందిస్తారు.
ఇటీవలే నార్త్బ్లాక్లో బడ్జెట్-2016 ప్రతుల ముద్రణ ప్రారంభానికి ముందు బడ్జెట్ ప్రక్రియలో పాల్గొన్న ఆర్ధిక శాఖ ఉద్యోగులు హల్వా వేడుకను కూడా చేసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన ఈ వేడుకకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, సహాయ మంత్రి జయంత్సిన్హా హాజరై తమ స్వహస్తాలతో హల్వా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి తదితరులు పాల్గొన్నారు.
1947 నుంచి కూడా బడ్జెట్ విషయంలో ప్రభుత్వం అంతటి గోప్యతను పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మంగళవారం నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి మంగళవారం రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక స్థితిగతుల్ని వివరించే ఆర్థిక సర్వేను ఈ నెల 26న పార్లమెంటుకు సమర్పిస్తారు. 25న రైల్వే బడ్జెట్ను, 29న సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 74 అంశాలను పార్లమెంటు ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో 62 లెజిస్లేటివ్ కాగా, 12 ఆర్థికపరమైనవి.