జిఎస్టీ ఎఫెక్ట్: ఒకే దేశం, ఒకే బిల్లు ఎక్కడ? ప్రశ్నించిన కాంగ్రెస్
ఒకే దేశం ఒకే బిల్లు ఎక్కడ అంటూ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. జిఎస్టీ అమలు తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ధరలను వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే బిల్లు ఎక్కడ అంటూ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. జిఎస్టీ అమలు తర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ధరలను వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు రెండు రాష్ట్రాలకు చెందిన బిల్లులను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
శనివారం నుండి వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఒకే దేశం ఒకే పన్ను అమలు కావడం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. తమ తొలి బిల్లులను సామాజిక మాథ్యమాల్లో పంచుకొంటున్నారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో పన్ను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి మనీష్ తివారీ కేంద్రప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
జలంధర్ రెస్టారెంట్, ముంబై రెస్టారెంట్లలోని బిల్లులను పోస్ట్ చేస్తూ జీఎస్టీ వ్యత్యాసాలను ఎత్తిచూపారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఎక్కడ అమలౌతోందని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఈ రెండు బిల్లులను పోస్ట్ చేశారు.ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. కొంతమంది పాత బిల్లులను కొత్త బిల్లులను కలిపి పోస్ట్ చేస్తున్నారు.
జీఎస్టీ అమలు తర్వాత ఏ రకంగా తమ జేబులకు చిల్లులు పడుతున్నాయో వివరిస్తున్నారు. కాగా, జీఎస్టీ కౌన్సిల్ కూడ తమ తొలి జిఎస్టీ బిల్లును పంచుకోవాలని సూచించింది.
బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం నాడు రూ.133 తో మసాలా దోశ, సాంబార్ వడ తిన్నాడు. శనివారం నాడు అదే హోటల్ లో వాటిని తింటే రూ.148 బిల్లు అయిందని పోస్ట్ చేశారు.
Recommended Video
హైద్రాబాద్ కు చెందిన ఓ కుటుంబం హోటల్ కు వెళ్ళి రూ.1,577 బిల్లు చేయగా, రూ. 183 జీఎస్టీ చెల్లించాల్సి వచ్చిందని వాపోయింది. ఇక గ్రాసరీ స్టోర్లు, షాపింగ్ లు తదితరాలకు సంబంధించిన బిల్లుల పోస్టులు సామాజిక మధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.