ఎఫ్ఐఆర్ ఏదీ ? మీరు చట్టానికి అతీతులా- పరమ్బీర్ సింగ్కు బోంబే హైకోర్టు ప్రశ్నలు
మహారాష్ట్రలో సంచలనం రేపిన వంద కోట్ల వసూళ్ల వ్యవహారం ఇవాళ మరో మలుపు తిరిగింది. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేను బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు వందకోట్లు వసూలు చేయమన్నారంటూ సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ ఇరుకునపడ్డారు.
అసలు ఈ వ్యవహారంలో పోలీసు కమిషనర్గా ఉన్న మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని బోంబే హైకోర్టు వేసిన ప్రశ్నకు మాజీ సీపీ పరమ్బీర్ సింగ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. మీరు చట్టానికి అతీతులు అనుకుంటున్నారా ? ఇంత పెద్ద ఆరోపణ చేసేటప్పుడు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయా ? ఉంటే ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు ? ఎఫ్ఐఆర్ లేకుండా సీబీఐ దర్యాప్తుకు కేసు అప్పగించమని ఎలా కోరుతున్నారు ? సీఎంకు రాసిన లేఖను పిల్గా తీసుకోమంటారా ? అని పరమ్బీర్ సింగ్ను హైకోర్టు చీవాట్లు పెట్టింది.

హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఆరోపణలు చేసినందుకు తనను ముంబై పోలీసు కమిషనర్గా తప్పించారంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరమ్బీర్ సింగ్ అనంతరం అత్యున్నత న్యాయస్ధానం సూచన మేరకు బోంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన బోంబే హైకోర్టు.. ఎఫ్ఐఆర్ లేకుండానే సీబీఐ దర్యాప్తు కోరడాన్ని తప్పుబట్టింది. అయితే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలా వద్దా అన్న అంశంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications