ఇడ్లీ ఎక్కడ పుట్టింది... ఇది భారతీయ వంటకం కాదా?
టిఫిన్లలో మకుటం లేని మహారాజు ఇడ్లీ. అట్లు, పెసరట్లు, పూరీ, ఉప్మా ఇలా ఎన్ని అల్పాహారాలు ఉన్నా తెల్లగా, మృదువుగా ఉండే ఇడ్లీకి సాటి రావు. వేడి వేడిగా పొగలు కక్కే ఇడ్లీలను కొబ్బటి చట్నీ, సాంబార్ లేదా ఇడ్లీ పొడితో నంజుకు తింటే రోజు హాయిగా ప్రారంభమయినట్టు ఉంటుంది. నూనె బాధ లేదు. పని తక్కువ, ఇంటిల్లిపాదికీ 10-12 ఇడ్లీలు ఒకేసారి పెట్టేయొచ్చు. తేలికగా జీర్ణమవుతుంది.
దక్షిణ భారతదేశంలో ఇడ్లీ దొరకని ప్రదేశం ఉండదు. తెలుగు రాష్ట్రాలలో మినప్పప్పు, బియ్యం రవ్వతో ఇడ్లీలు పెట్టుకుంటే, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో మినప్పప్పు, బియ్యంతో ఇడ్లీలు వండుతారు. ఇడ్లీ బియ్యం అని ప్రత్యేకంగా దొడ్డు బియ్యం దొరుకుతుంది కూడా.
అలాంటి ఇడ్లీ పుట్టింది భారతదేశంలో కాదా? ఇడ్లీ భారతదేశానికి బయటి నుంచి వచ్చిందా?
అవునంటున్నారు చరిత్రకారులు.
దోశ, ఆపం, వడ, బజ్జీ లాంటి టిఫిన్ల గురించి తమిళ సంగం సాహిత్యంలో ఉంది. అంటే ఇవన్నీ మనకు క్రీ.పూ 300 నుంచి తెలుసు. మరి ఇడ్లీ సంగతేంటి?
- దక్షిణ భారతదేశ ఆహారాన్ని అవమానించేలా బ్రిటిష్ చరిత్రకారుడి ట్వీట్.. దేశవిదేశాల్లోని ఇడ్లీ ప్రియుల ఆగ్రహం
- బ్రేక్ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?
ఇడ్లీ కథ
భారతదేశంలో తొలిసారిగా కర్ణాటక ప్రాంతంలో రాసిన కావ్యాలలో ఇడ్లీల ప్రస్తావన వచ్చిందని, వాటిని 'ఇడ్డలిగే' అనేవారని, సంస్కృతంలో 'ఇడ్డరికా' అని పిలిచేవారని ఫుడ్ హిస్టారియన్ కేటీ అచ్చయ్య వివరించారు.
కన్నడలో అలిగే అంటే ఆవిరి పాత్ర అని అర్థం. దాని నుంచే ఇడ్డలిగే వచ్చి ఉండవచ్చని అచ్చయ్య అంచనా వేశారు.
క్రీ.శ. 920లో కన్నడ కవి శివకోటి ఆచార్య రాసిన 'వద్దరదానే' అనే కావ్యంలో మొదటిసారి ఇడ్లీ ప్రస్తావన వచ్చిందని 'ఇండియన్ ఫుడ్: ఏ హిస్టారికల్ కంపానియన్' అనే పుస్తకంలో అచ్చయ్య రాశారు.
ఇంటికి వచ్చిన బ్రహ్మచారికి ఆతిధ్యం ఇచ్చే 18 పదార్థాలలో ఇడ్లీ ఒకటని వద్దరదానే కావ్యంలో రాశారు. ఆ తరువాత పలు రచనలలో ఇడ్లీ ప్రస్తావన వచ్చింది.
క్రీ.శ. 1025లో చవుందరాయ అనే కవి ఇడ్లీ తయారీ ప్రక్రియను వివరించారు. మినప్పప్పును మజ్జిగలో నానబెట్టి, మెత్తగా రుబ్బి, దాన్లో మజ్జిగ, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంగువ వేసి ముద్దగా చేసేవారని రాశారు.
ఆ తరువాత, క్రీ.శ 1130లో 'మానసోల్లాస' అనే సంస్కృత గ్రంథంలో ఇడ్లీ ప్రస్తావన ఉందని అచ్చయ్య తన పుస్తకంలో వివరించారు.
మానసోల్లాస గ్రంథాన్ని 'అభిలాషితార్థ చింతామణి' అని కూడా అంటారు. దీన్ని చాళుక్య రాజైన మూడవ సోమేశ్వరుడు (క్రీ.శ 1127-1138) రచించాడు.
మినప్పప్పును పిండి చేసి, గుండ్రని ఉండలుగా చేసి నేతిలో వేయిస్తారని మానసికోల్లాసలో రాసి ఉంది. ఈ ఉండలపై మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ జల్లేవారు.
'సుశీతా ధవళా శ్లక్ష్ణా ఏతా ఇడరికా వరాః| తస్యైవ మాషపిష్టస్య గోళకాన్ విస్తృతాన్ ఘనాన్|' అని మానసికోల్లాసలో రాసి ఉందని, ఆ పుస్తకం చదివిన తెలుగు బ్లాగర్ రవి ఈఎన్వీ చెప్పారు.
దాని అర్థం "చల్లనివి, తెల్లనివి, మృదువైనవి అయిన ఇడ్లీలు గొప్పవి. వాటిని ఉద్దిపిండి (మినప్పిండి)తో గుండ్రంగా, పెద్దగా, ఘనంగా చేస్తారు" అని.
కర్ణాటకలో క్రీ.శ 1235 నాటి ఒక ప్రస్తావనలో ఇడ్లీలను "తేలికైన, విలువైన నాణేల వంటి" పదార్థంగా సూచించారు.
తమిళనాడులో 17వ శతాబ్దంలో రచించిన మచ్చపురాణంలో 'ఇట్టలి' పేరుతో ఇడ్లీ ప్రస్తావన ఉందని అచ్చయ్య రాశారు.
అయితే, పైన చెప్పిన మూడు సందర్భాల్లోనూ ఇడ్లీని తయారుచేయడానికి బియ్యం వాడారన్న ప్రస్తావన లేదు. తొలినాళ్లలో ఇడ్లీని కేవలం మినప్పప్పుతోనే వండి ఉండవచ్చని అచ్చయ్య భావిస్తున్నారు.
అదే కాకుండా, పై మూడు సందర్భాల్లోనూ.. ఆధునిక కాలంలో ఇడ్లీ తయారీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ప్రస్తావించలేదు. ఒకటి.. బియ్యం, మినప్పప్పు పాళ్లుగా తీసుకోవడం, రెండు.. దాన్ని రుబ్బడం, మూడు.. రుబ్బిన పిండిని పులవబెట్టడం. చివరిగా, పులిసిన పిండిని ఆవిరి మీద ఉడకబెట్టడం.
ఇడ్లీ తయరీలో ఈ ప్రక్రియలన్నీ ఎప్పుడు వచ్చి చేరాయో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు పుస్తకాలలో, గ్రంథాలలో దొరకలేదని అచ్చయ్య తన పుస్తకంలో రాశారు.
క్రీ.శ 1485, క్రీ.శ 1600 మధ్య ఇడ్లీని చందమామతో పోల్చి చెప్పేవారు. అంటే అప్పటికి ఇడ్లీ తయారీలో బియ్యం వాడడం మొదలుపెట్టి ఉండవచ్చని ఆయన భావించారు.
- కర్ణాటక.. తమిళనాడు.. దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది
- మీకు తెలియని సమోసా సంగతులు!
ఇంతకీ ఇండ్లీ ఎక్కడి నుంచి వచ్చింది?
భారతదేశానికి ఇడ్లీ ఇండోనేషియా నుంచి వచ్చి ఉండవచ్చని కేటీ అచ్చయ్య తన పుస్తకంలో వివరించారు.
ఆయన పరిశోధన ప్రకారం, ఇండోనేషియాలో పదార్థాలను ఆవిరి మీద ఉడకబెట్టడం పురాతన కాలం నుంచి ఉండేది. సోయాబీన్స్, వేరుసెనగపలుకులు, చేపలు మొదలైనవాటిని ఆవిరి మీద ఉడకబెట్టి తినేవారు.
ఇండోనేషియాలో పిండిని పులియబెట్టి, ఆవిరి మీద ఉడకబెట్టి వండే పదార్థాన్ని 'కెడ్లీ' అనేవారని అచ్చయ్య రాశారు.
చైనాలో కూడా ఆవిరి మీద ఉడకబెట్టే పద్ధతి పురాతన కాలం నుంచి ఉంది. 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనా బౌద్ధ భిక్షువు హుయెన్ త్సాంగ్ భారతదేశంలో ఆవిరి పాత్రలు లేవు అని పేర్కొన్నారు.
క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యలో ఇండోనేషియాను పాలించిన హిందూ రాజుల దగ్గర పనిచేసిన భారతీయ వంటగాళ్లు, పెళ్లి కోసం స్వదేశానికి వచ్చినప్పుడు, అక్కడి పులియబెట్టే ప్రక్రియను భారతదేశానికి పరిచయం చేసి ఉండవచ్చని కేటీ అచ్చయ్య వివరించారు.
మినప్పప్పుతో పాటు బియ్యం కలిపితే పిండి బాగా పులుస్తుందని తరువాత కాలంలో భావించి ఉండవచ్చు. అలా, ఇడ్లీ తయారీలో బియ్యం వచ్చి చేరి ఉండవచ్చని ఆయన రాశారు.
చెకోస్లోవేకియాలో కూడా కెడ్లీకి సమానమైన పదార్థాన్ని వండేవారు. దాన్ని 'నీడ్లీక్' అని పిలిచేవారు.
ఇడ్లీ కాకుండా, కడుబు అనే పదార్థాన్ని కూడా ఆవిరి మీద ఉడికించేవారని, కన్నడ కావ్యాల్లో కడుబు ప్రస్తావన క్రీ.శ. 1430లలో కనిపించిందని అచ్చయ్య వివరించారు. కడుబును ఆకుల్లో చుట్టి ఉడికించేవారు. దాన్నే మనం ఆవిరి కుడుము అంటాం.
పులియబెట్టడం, ఇడ్లీ చేసుకోవడం తెలియపోవచ్చుగానీ, ఆవిరి మీద వండడం భారతీయులు ముందే తెలుసునని అచ్చయ్య చెబుతున్నారు.
"చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ భారతదేశంలో ఆవిరి పాత్రలు లేవు అన్నాడు. కానీ, దానర్థం మనకు ఆవిరితో వండడం తెలీదని కాదు. భారతదేశంలో సులువైన రీతిలో ఆవిరి పట్టడం తెలుసు. పొయ్యి మీద పాత్రలో నీరు పోసి సలసలా కాగిన తరువాత, సన్నని గుడ్డలో లేదా వెదురు బుట్టల్లో పదార్థాన్ని చుట్టి, పై నుంచి వేలాడ దీసేవారు. లేదా ఆకులు, చిల్లుల పళ్లాల వంటి వాటిని వాడేవారు. కేరళలో పుట్టు వండడానికి, వెదురు బొంగులో పదార్థాన్ని కుక్కి సలసలా కాగురున్న నీటిలో స్థిరంగా నిల్చోబెట్టేబారు. అలాగే, ఇండస్ వ్యాలీ సైట్లలో పొడువుగా, చిల్లులతో ఉండే మట్టి పాత్ర లభ్యమైంది. దీన్నిబట్టి మనం ఆవిరి మీద ఉడికించే వంటలు చేసుకునేవాళ్లమని స్పష్టమవుతోంది" అని కేటీ అచ్చయ్య తన పుస్తకంలో రాశారు.
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- ఆకలిని నియంత్రించే ఆహార పదార్థాలు ఏవి?
ఎన్ని రకాల ఇడ్లీలో..
ఇండోనేషియా నుంచి మన దేశానికి వచ్చి స్థిరపడిందని భావిస్తున్న ఇడ్లీ ఆధునిక కాలంలో ఎన్నో రూపాంతరాలు చెందింది. ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఎంటీఆర్ ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ లాంటివి చాలా ఫేమస్ అయ్యాయి.
ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన ఆహార పదార్ధం ఇడ్లీ అని ప్రముఖ ఫుడ్ రచయత వీర్ సింఘ్వి అంటారు.
రవ్వ ఇడ్లీ, రాగి ఇడ్లీ, పొడి ఇడ్లీ, తట్టె ఇడ్లీ, బటన్ ఇడ్లీ, స్టఫ్ఫుడు ఇడ్లీ, ఆఖరుకి షేజువాన్ ఇడ్లీ కూడా వండుతున్నారు.
ఈమధ్యే మరో కొత్త రకం ఇడ్లీ వెలుగులోకి వచ్చింది. చార్కోల్ అని ఇడ్లీ పిలిచే నల్లటి ఇడ్లీలు వండుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా.
https://twitter.com/ANI/status/1214417282970972160
భారతదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష నౌక 'గగన్యాన్' లో వెళ్లే ఆస్ట్రోనాట్ల కోసం డిఫెన్స్ ఫుడ్ రిసెర్చ్ లాబొరేటరీ కొన్ని స్వదేశీ వంటకాలను తయారుచేసిందని, అందులో సాంబార్ ఇడ్లీ ఒకటని 2020లో ఏఎన్ఐ ట్వీట్ చేసింది. రెండు రూపాయల బిళ్లంత ఇడ్లీలను సాంబార్లో ముంచి ప్యాక్ చేశారు.
అయితే, కోవిడ్ ముంచుకురావడంతో గగన్యాన్ వాయిదా పడింది. ఈ మిషన్ 2024లో అంతరిక్షంలోకి వెళ్లవచ్చని ఈ జూన్లో ఇస్రో చైర్మన్ వెల్లడించారు. అంటే, మరో రెండు, మూడేళ్లల్లో ఇడ్లీ అంతరిక్షానికి కూడా చేరుకుంటుందన్నమాట.
ఇవి కూడా చదవండి:
- డ్రగ్స్ తీసుకుని దొరికిపోయిన బౌద్ధ సన్యాసులు, ఆలయమంతా ఖాళీ
- ఆర్టెమిస్: నాసా మరో రికార్డు... భూమి నుంచి అత్యధిక దూరం ప్రయాణించిన ఓరియన్ క్యాప్సూల్
- 'మియా' మ్యూజియం: అస్సాంలోని 'ముస్లిం' మ్యూజియంపై వివాదం ఏంటి?
- 'ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను 'వల్గర్’ అన్న ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ చైర్మన్, ఎవరు ఎలా స్పందించారు?
- హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరూ మాట్లాడటం మానేశారా? తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కేసులున్నాయి?