సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన ఆ ఒక్క మాట.. దేశానికే పండుగైంది!
తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఆ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్ధాన్ని చూపిస్తూ సరైన దిశలో నడిపించే శిల్పులు ఉపాధ్యాయులు. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, జ్ఞానదీపాలను వెలిగించే ప్రతి గురువుకూ మనసారా దండం పెట్టాల్సిన సందర్భమిది. భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీని మనం ఎంతో పండుగలా 'ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. అయితే అసలు ఈ రోజునే ఎందుకు ఎంచుకున్నారు? దేశంలోనే తొలిసారిగా టీచర్స్ డే వేడుకలను ఎప్పుడు, ఎవరి హయాంలో జరిపారో తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.
ఆ రాష్ట్రపతి గొప్పమనసే.. దేశానికే పండుగైంది!
భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా, అంతకుముందు మొదటి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన్ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా గొప్ప తత్త్వవేత్తగా, మేధావిగా, అంతకంటే మిన్నగా ఓ ఉత్తమ ఉపాధ్యాయుడిగా దేశం గౌరవిస్తుంది. 1962లో ఆయన దేశ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, ఆయన శిష్యులు, అభిమానులు సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు. కానీ డాక్టర్ సర్వేపల్లి అందుకు అంగీకరించలేదు. తన ఒక్కడి పుట్టినరోజు జరుపుకోవడం కంటే, ఆ రోజును దేశంలోని ఉపాధ్యాయులందరి త్యాగాలకు, సేవలకు గురింపుగా 'టీచర్స్ డే'గా జరిపితే తాను ఎంతో సంతోషిస్తానని తన మనసులోని మాటను వెల్లడించారు.

1962లో మొదలైన పవిత్ర సాంప్రదాయం!
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇచ్చిన ఆ పిలుపే భారత్లో ఓ గొప్ప సాంప్రదాయానికి పునాది వేసింది. ఆయన సూచన మేరకు 1962 సెప్టెంబర్ 5న దేశంలోనే మొదటిసారిగా అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. తన వ్యక్తిగత గౌరవం కంటే సమాజ నిర్మాణంలో నిరంతరం శ్రమించే ఉపాధ్యాయ లోకానికే పెద్దపీట వేసిన ఆయన గొప్పదనం నాటి నుంచి నేటి వరకు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అలా గత ఆరు దశాబ్దాలకు పైగా సెప్టెంబర్ 5వ తేదీ గురుపూజోత్సవానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.
తరగతి గది నుంచి దేశ అత్యున్నత పీఠం దాకా..
1888 సెప్టెంబర్ 5న జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. దేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాల పాటు అధ్యాపకుడిగా పని చేసిన ఆయన, విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాతే ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి ఉపరాష్ట్రపతిగా, ఆపై రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవులను అధిష్ఠించారు. పదవులు మారినా తనలోని ఉపాధ్యాయుడిని, విద్యారంగంపై ఉన్న మమకారాన్ని ఆయన ఎన్నడూ వీడలేదు. "సరియైన విద్య ద్వారానే మానవ వికాసం, సమాజ పురోగతి సాధ్యమవుతాయి" అని ఆయన బలంగా నమ్మారు.
పాఠశాలల్లో పండుగ వాతావరణం!
సెప్టెంబర్ 5 వచ్చిందంటే చాలు దేశంలోని పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల కోలాహలంతో కళకళలాడుతాయి. గురువులకు పూలగుత్తులు, గ్రీటింగ్ కార్లు ఇస్తూ తమ కృతజ్ఞతను చాటుకుంటారు. చాలా పాఠశాలల్లో సీనియర్ విద్యార్థులే ఒక రోజు ఉపాధ్యాయులుగా మారి తరగతులు చెప్పడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే కాకుండా, జీవితంలో ఎలా గెలవాలో నేర్పే ప్రతి మార్గదర్శికీ సెల్యూట్ చేస్తూ వేడుకలు జరుపుకోవడమే ఈ రోజు యొక్క అంతరార్థం.














Click it and Unblock the Notifications