సుబ్రతారాయ్పై బ్లాక్ ఇంక్: మనోజ్ శర్మ ఓ సంచలనం?
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్ పైన ఓ వ్యక్తి మంగళవారం నల్లటి సిరా చల్లి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్ శర్మ. మంగళవారం సుప్రీం కోర్టుకు హాజరైన సుబ్రతా ముఖం పైన నల్లటి సిరా పోశారు. సుబ్రతా అనుచరులు మనోజ్ను చితకబాదగా, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
అతను తన చొక్కా విప్పి సుబ్రతాకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 107, 151 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇతను తన వెంట ఇంక్ పట్టుకొని ఢిల్లీకి తిరుగుతుంటారట. ఇతను గ్వాలియర్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పని చేశాడు.
మనోజ్ శర్మ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా గుడ్డిగుడ్డా గ్రామానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు సుబ్రతా పైన ఇంక్ పోసి పతాక శీర్షికలకు ఎక్కినట్లు గతంలోను వార్తల్లో నిలిచాడు.
2011లో మనోజ్ శర్మ నాటి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు సురేష్ కల్మాడీ పైన చెప్పు విసిరాడు. ఢిల్లీలోని పాటియాలా కోర్టు కాంప్లెక్సులో అతను చెప్పు విసిరి సంచలనం సృష్టించాడు. ఆ సమయంలో అతను మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించేందుకు తనను దేవుడు పంపించాడని చెప్పాడు. అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా కూడా చెప్పారు.
అయితే, కల్మాడీ పైన దాడి చేసిన అనంతరం గ్వాలియర్ పట్టణానికి వచ్చిన అతనికి పలువురు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో మనోజ్ శర్మ మాట్లాడుతూ... ఇప్పుడు అవినీతిపరులపై ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నాడు.
వాజపేయి పేర ఫేక్ డెత్ సర్టిఫికేట్
అత్యున్నత స్థాయిలో ఉన్న అవినీతిని బట్టబయలు చేసేందుకు 2006లో మనోజ్ శర్మ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి డెత్ సర్టిఫికేట్ కూడా తీశారట. తాను ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే అనుచరుడిగా మనోజ్ శర్మ చెప్పుకుంటారు.
మనోజ్ శర్మ పైన హత్యాయత్నం కేసు
ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట ప్రకారం.... మనోజ్ శర్మ పైన హత్యాయత్నం కేసు నమోదయింది. ఇది 2006-2007 మధ్య జరిగింది. కాగా, మనోజ్ శర్మకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలో ఇతనికి సొంత ప్రాపర్టీ ఉంది.