కరోనా విలయం: ప్రమాదంలో ఇండియా? : పాజిటివ్ రేటుపై కేంద్రం కీలక ప్రకటన : WHO వార్నింగ్ దాటి..
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ కొత్త కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆందోళన రెట్టింపయింది. కేసుల సంఖ్యలో మన దేశం ఇప్పటికే రష్యాను దాటేసి ప్రపంచంలో టాప్-3 స్థానికి ఎగబాకింది. సోమవారం కొత్తగా 24,248 పాజిటివ్ కేసులు, 425 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7లక్షలకు, మరణాల సంఖ్య 20వేలకు చేరువైంది. ఇదే సమయంలో పాజిటివ్ రేటు గురించి కేంద్రం చేసిన ప్రకటన ఒకింత కలవరపాటుకు గురిచేస్తున్నది.

జాతీయ సగటు 6.73 శాతం..
విస్తృతంగా కోవిడ్ -19 పరీక్షలు చేపట్టే దేశాల్లో.. పాజిటివ్ రేటు 5 శాతంలోపు ఉంటేనే సేఫ్ అని భావించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గతంలోనే ఓ హెచ్చరిక జారీ చేసింది. అయితే, మన దేశంలో పాజిటివ్ రేటు మాత్రం 6.73శాతంగా ఉండటం ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఇప్పటిదాకా మన దేశంలో 1కోటికిపైగా కరోనా టెస్టులు నిర్వహించగా, పాజిటివిటీ రేటు జాతీయ సగటు 6.73గా నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ఈక్రమంలో టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని, సత్వర కాంటాక్ట్ ట్రేసింగ్, సకాలంలో క్లినికల్ మేనేజ్మెంట్కు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. కేంద్రం చర్యలకు ఉపక్రమించిన తర్వాత దేశరాజధాని ఢిల్లీలో పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా,

పాజిటివ్ రేటు అతి ప్రధానం..
ఒక దేశం లేదా ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అంచనా వేయడానికి పాజిటివిటీ రేటు అతిముఖ్యమైన కొలబద్ద అని, దాన్నే బట్టే కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశకు చేరిందీ లేనిదీ అంచనా వేయగలమని డబ్ల్యూహెచ్వో, జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ లాంటి ప్రఖ్యాత సంస్థలు చెబుతున్నాయి. ఒక దేశం లేదా ప్రాంతంలో పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందంటే.. అక్కడ తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్లకు మాత్రమే టెస్టులు చేస్తున్నట్లుగా భావించాలని, అప్పుడు స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్నవాళ్లను వదిలేస్తున్నట్లే అవుతుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పాజిటివ్ రేటు తక్కువగా ఉందంటే.. అక్కడ స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్నవాళ్లకు కూడా టెస్టులు జరుగుతోన్నట్లుగా భావించాలని తెలిపాయి.

రాష్ట్రాల్లో ఇలా..
పాజిటివ్ రేటు గురించి డబ్ల్యూహెచ్వో, జాన్ హోప్కిన్స్ వర్సిటీ హెచ్చరికలను బట్టి మన దేశంలో కొన్ని రాష్ట్రాల పరిస్థితి ప్రమాద స్థాయిని మించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో గత నెల చివరి 18 రోజుల్లో చేపట్టిన టెస్టుల్లో 30శాతానికి మించి పాజిటివ్ రేటు నమోదైంది. అదే ఏపీలో పాజిటివ్ శాతం 1.8గాను, ఛత్తీస్ గఢ్ 1.8 శాతం, హిమాచల్ ప్రదేశ్లో 1.2 శాతం, జార్ఖండ్లో 1.73 శాతం, కేరళలో 1.92 శాతంపాజిటివ్ రేటు ఉంది. తద్వారా స్వల్ప లక్షణాలున్నవాళ్లకు కూడా టెస్టులు చేసినప్పుడే వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలమని వెల్లడైంది.












Click it and Unblock the Notifications