Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరుస బస్సు ప్రమాదాలు.. అసలు ఎందుకిలా జరుగుతోంది?

ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తున్నాయి. జనాలు బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో జరిగిన కొన్ని ముఖ్యమైన బస్సు ప్రమాదాల వివరాలు.. భారీ ప్రాణనష్టం, తీవ్ర గాయాలకు దారితీస్తున్న వరుస బస్సు ప్రమాదాలకు గల ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటన
ఏపీలోని కర్నూలులో అక్టోబర్ 24వ తేదీని చోటుచేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెనువిషాదాన్ని నింపింది. కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది అమాయక ప్రయాణీకులు అగ్నికి ఆహుతయ్యారు. తెల్లవారుజామున రోడ్డుపై ప్రమాదానికి గురై పడి ఉన్న బైక్‌ను చూసుకోకుండా అలాగే బస్సును పోనిచ్చిన డ్రైవర్ ఈ దారుణానికి ప్రధాన కారకుడిగా నిలిచాడు. రోడ్డుపై పడి ఉన్న బైకును బస్సు చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ఉన్నవారిలో 20 మంది బస్సులోనే సజీవదహనమయ్యారు.

Why Are Bus Accidents Increasing Key Reasons Analysis and Safety Measures

చేవెళ్లలో మరో విషాదం
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. దీంతో టిప్పర్‌లో ఉన్న కంకర మొత్తం బస్సులో కుప్పగా పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది గాయపడ్డారు. టిప్పర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

సౌదీలో 45 మంది హైదరాబాదీలు మృతి
సౌదీ అరేబియాలో నవంబర్ 17న విషాద ఘటన చోటుచేసుకుంది. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు. మదీనాకు వెళ్తున్న బస్సు ఓ చమురు ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 46 మంది మక్కా యాత్రకు వెళ్లగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు, 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు హజ్ కమిటీ వెల్లడించింది.

తాజాగా మరో ఘటన
తెలంగాణ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పరిసరాల్లో జాతీయ రహదారి 44పై ఈరోజు ( నవంబర్ 20, 2025 ) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న జగన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు.. ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొట్టడంతో పెను ప్రమాదం జరిగింది. కాగా బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ఉండగా.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టిన వెంటనే యాసిడ్ లీకై రోడ్డుమీద పడింది. అయితే రసాయనిక ప్రతిచర్య వల్ల వెంటనే తెల్లటి పొగలు విపరీతంగా వచ్చాయి. ఈ అనూహ్య ఘటనతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మంటలు అంటుకునేది కాకపోవడం పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

అసలు ఈ బస్సు ప్రమాదాలకు కారణాలు ఏంటి ?

వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలకు ప్రధానంగా మూడు రకాల కారణాలు ఉన్నట్లు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మానవ తప్పిదాలు , సాంకేతిక లోపాలు , మరియు రోడ్డు పరిస్థితులు.

1.మానవ తప్పిదాలే ప్రధాన కారణం
బస్సు ప్రమాదాలకు సంబంధించి దర్యాప్తు చేసిన ప్రతిసారీ 90 శాతానికి పైగా కేసులలో మానవ తప్పిదమే ప్రధాన కారణంగా తేలింది. రోడ్లపై వేగ పరిమితులను పాటించకపోవడం, ఓవర్ టేకింగ్‌కు ప్రయత్నించడం వంటివి ప్రమాదాలకు ముఖ్య కారణాలుగా ఉన్నాయి. టైరు పేలడం వంటి సాంకేతిక సమస్యలు వచ్చినా, వేగం ఎక్కువగా ఉంటే డ్రైవర్ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది.ప్రైవేట్, ప్రభుత్వ రవాణా సంస్థల్లో సుదూర ప్రయాణాలకు వెళ్లే డ్రైవర్లు సరైన విశ్రాంతి తీసుకోకుండా డ్రైవింగ్ చేయడం వల్ల నిద్రమత్తులోకి జారుకుంటారు. ఇది నియంత్రణ కోల్పోయి, ప్రమాదాలకు దారి తీస్తుంది. కొందరు డ్రైవర్లు మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరిగి ప్రమాదాలు సంభవిస్తాయి.సరైన సిగ్నల్స్ ఇవ్వకుండా లేన్ మార్చడం, హెడ్ లైట్స్ ఉపయోగించకపోవడం లేదా ఎదురుగా వచ్చే వాహనాలను గమనించకపోవడం వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతాయి.

2. సాంకేతిక, నిర్వహణ లోపాలు
బస్సులు పాతబడటం, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రేక్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయకపోవడం లేదా కొన్ని పాతబడిన పరికరాలను మార్చకపోవడం వల్ల బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదాలు జరుగుతాయి. ఎక్కువ కాలం వాడిన టైర్లను మార్చకపోవడం లేదా నాసిరకం టైర్లను ఉపయోగించడం వల్ల వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు అవి పేలిపోయి, వాహనం అదుపు తప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా స్లీపర్ బస్సులలో భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల ఒక చిన్న ప్రమాదం కూడా పెద్ద ప్రాణ నష్టానికి దారితీస్తుంది. వైరింగ్ లోపాలు లేదా ఇంధన వ్యవస్థలో లీకేజీ కారణంగా బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

3. రోడ్డు, వాతావరణ పరిస్థితులు
రోడ్లపై ప్రమాదకరమైన మలుపులు, అంధ మలుపులు లేదా సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వర్షాలు, పొగమంచు ఉన్నప్పుడు డ్రైవర్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తాయి.

బస్సు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు
ప్రమాదాలను తగ్గించడానికి వ్యక్తిగత, ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. సుదూర ప్రయాణాల ముందు డ్రైవర్లకు కనీసం 8 గంటల విశ్రాంతి ఉండేలా రవాణా సంస్థలు కఠిన నిబంధనలు పాటించాలి. డ్రైవింగ్ సమయాన్ని పర్యవేక్షించడానికి టెక్నాలజీ (ట్రాకింగ్ సిస్టమ్స్) ఉపయోగించాలి. రవాణా శాఖ అధికారులు బస్సుల ఫిట్‌నెస్, టైర్ల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.
డ్రైవర్లకు క్రమం తప్పకుండా భద్రత, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇవ్వాలి. అతి వేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలకు కఠిన శిక్షలు అమలు చేయాలి.అన్ని బస్సుల్లో స్పీడ్ గవర్నర్‌లు , అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు సరిగా పనిచేసేలా చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+