సిద్ధరామయ్య ఓటమికి కారణాలివే.. అంత నిర్లక్షమా?.. ఖచ్చితంగా గుణపాఠమే!
Recommended Video
కర్ణాటక తాజా ఎన్నికలు కాంగ్రెస్, ఆ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ గుణపాఠంగా నిలిచాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని పలు నివేదికలు వెల్లడించినా జాగ్రత్త పడలేదు. దాంతో బీజేపీ గెలువడానికి కాంగ్రెస్ దోహదపడింది. అంతేకాకుండా భారీ మూల్యాన్ని సిద్దరామయ్య చెల్లించుకొన్నారు. అధికారంలో ఉన్నప్పటికీ.. బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో తడబాటు పడింది. కానీ ఈ విషయంలో బీజేపీ సఫలమైంది.
లింగాయత్ వర్గం షాక్
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించాలని సీఎం సిద్ధరామయ్య చేసిన ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది. లింగాయత్లను మైనారిటీలుగా గుర్తించాలని చేసిన ప్రయత్నానికి ఆ వర్గం నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ఆకట్టుకోలేకపోయిన సిద్ధరామయ్య
సిద్ధరామయ్య ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో అనుకున్నంత వ్యతిరేకత లేదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. కానీ సిద్దరామయ్య అమలు చేసిన పథకాలు అంతగా ప్రజలను, ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి.
మోదీ ఆకర్షణ ముందు
ప్రధాని మోదీ ఆకర్షణ ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుగానీ, సిద్ధరామయ్య పథకాలు అంతగా పనిచేయలేదు. బీజేపీకి ఓట్లు సంపాదించిపెట్టడంతో మోడీ ప్రచారం అద్భుతంగా పనిచేసింది. కర్ణాటక ఫలితాలు యాడ్యురప్ప గెలుపు కంటే మోదీ విజయమే అని చెప్పవచ్చు.
సిద్ధరామయ్యకు మైనారిటీల షాక్
కాంగ్రెస్ నేతగా సిద్ధరామయ్యకు మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితుల నుంచి మంచి అండ ఉంది. తన జీవితంలో వారి మద్దతుతోనే అంచెలంచెలుగా ఎదిగారు. కానీ తాజా ఎన్నికల్లో వారంత దూరమైనట్టు స్పష్టమైంది.
సొంత కమ్యూనిటీ దూరం
పాత మైసూరులో కరుబా కులానిదే అధిపత్యం ఉంటుంది. సిద్ధరామయ్య స్వతహాగా కురుబ నేత కావడం, అంతేకాకుండా ఏహెచ్ విశ్వనాథ్కు కురుబ కమ్యూనిటీలో బలమైన నేతగా పేరుంది. గత ఎన్నికల్లో ఈ కమ్యూనిటి సిద్ధరామయ్యకు సహాకారం అందించింది. అలాంటి వారిని నిర్లక్ష్యం చేయడంతో ఈ ఎన్నికల్లో వారంతా కాంగ్రెస్కు దూరమయ్యారు.
ఐటీదాడులతో బెంబేలు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారుల దాడుల నిర్వహించడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణ ధోరణిలో పడింది. ఎన్నికల ఖర్చుకావాల్సిన నిధుల కొరత ఏర్పడటంతో ప్రచారంలో సమస్యలు తలెత్తాయి. ఓ దశలో తనపై ఐటీ దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మోదీ, అమిత్ షాపై సిద్ధరామయ్య ఆరోపణలు సంధించారు.