కాశీలో సోనియా, రాయ్బరేలీలో మోడీ ప్రచారమేది: కేజ్రీ
వారణాసి: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలు పరస్పరం తమ వారి నియోజకవర్గాలలో ఎందుకు ప్రచారం చేయడం లేదో చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
సోనియా, మోడీల మధ్య పరోక్ష ఒప్పందం ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు ఎందుకు ప్రచారం చేయడం లేదో చెప్పాలన్నారు.
మోడీ గుజరాత్లోని వడోదర, ఉత్తర ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గాల నుండి పోటీ చేస్తుండగా, సోనియా గాంధీ రాయ్ బరేలీ నుండి బరిలో ఉన్నారు. మోడీ పైన కేజ్రీవాల్ వారణాసిలో పోటీ చేస్తున్నారు.
బిజెపి సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా పైన అవినీతి ఆరోపణలు చేస్తుందే తప్ప ఆయనకు వ్యతిరేకంగా కేసు ఎందుకు ఫిర్యాదు ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు.
తమ 49 రోజుల ప్రభుత్వంలో ఢిల్లీలో షీలా దీక్షిత్కు వ్యతిరేకంగా ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. రాజస్థాన్లో బిజెపి ప్రభుత్వం ఉందని, వారు వాద్రా పైన కేసులు ఎందుకు నమోదు చేయడం లేదన్నారు. అదే సమయంలో యూపిఏ ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. స్నూపగేట్ కుంభకోణంలో మోడీని అరెస్టు చేయడంలో యూపిఏ విఫలమైందన్నారు. ఇరు పార్టీలు ముఖ్య నేతల పైన పరస్పరం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు.