నరేంద్ర మోదీని నేరుగా ఢీకొట్టేందుకు రాహుల్ గాంధీ ఎందుకు సిద్ధపడటం లేదు?
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని తీసుకువచ్చేందుకు 2019 నుంచి అన్వేషణ కొనసాగుతోంది.
ఈ ఏడాది సెప్టెంబరు కల్లా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలను పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యం నిర్దేశించుకుంది.
ఆ గడువు దగ్గర పడుతోంది. కానీ కాంగ్రెస్ అన్వేషణ మాత్రం ఇంకా పూర్తికాలేదు.
ఈ విషయంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గహ్లోత్ సోమవారం మాట్లాడారు. ''ఒకవేళ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు కాకపోతే, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తికి గురవుతారు. లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని.. అధ్యక్షుడి పదవిని రాహుల్ గాంధీనే చేపట్టాలి’’ అని ఆయన అన్నారు.
ఇప్పటికీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ వైపే చూస్తున్నారు. కానీ, అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు రాహుల్ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.
అసలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఎందుకు సిద్ధంగా లేరనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
రాహుల్ గాంధీ వెనకడుగు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఏళ్ల నుంచి వార్తలు రాస్తున్న సీనియర్ జర్నలిస్టులు చెప్పారు.
ఈ కారణాలు కొన్ని రాజకీయమైనవి, మరికొన్ని వ్యక్తిగతమైనవి, ఇంకొన్ని పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవని వారు విశ్లేషించారు.
చరిత్రను పరిశీలిస్తే..
రాహుల్ గాంధీ వెనకడుగు వేయడానికి కారణాలు తెలుసుకోవాలంటే ప్రస్తుత పరిస్థితులతో పాటు చరిత్రను కూడా పరిశీలించాల్సి ఉంటుందని పార్టీ వ్యవహారాలపై ఏళ్ల నుంచీ వార్తలు రాస్తున్న సీనియర్ జర్నలిస్టు ఔరంగజేబ్ నక్సాబందీ అన్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆ సమయంలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఆయన నాలుగు పేజీల లేఖను ట్విటర్ వేదికగా విడుదల చేశారు.
తను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే విషయంతోపాటు కొన్ని కీలక అంశాలను ఆ లేఖలో రాహుల్ ప్రస్తావించారని ఔరంగజేబ్ చెప్పారు.
''ఆ ఓటమికి చాలా మంది కారణం. కానీ, నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఎందుకంటే బాధ్యతల నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం సరికాదని మిగతావారికి చెప్పాలని అనుకుంటున్నాను’’ అని ఆనాడు రాహుల్ చెప్పినట్లు ఔరంగజేబ్ వివరించారు.
''ఆ పరిస్థితికి కారణమైన మరికొంత మంది కూడా రాజీనామా చేయాలని అప్పట్లో రాహుల్ భావించారు. కానీ, రాహుల్ తప్ప, మరే పెద్ద నాయకుడు అప్పట్లో రాజీనామా చేయలేదు’’ అని ఔరంగజేబ్ అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ దారెటు?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
ఒంటరిగా...
ఆ లేఖలో ఒకచోట తన శక్తినంతా ఉపయోగించి ప్రధాన మంత్రితో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో పోరాడానని రాహుల్ ప్రస్తావించారు.
''ఎన్నికల సమయంలో రఫేల్ కుంభకోణం, చౌకీదార్ చోర్ హై లాంటి అంశాలను రాహుల్ పదేపదే లేవనెత్తారు. కానీ, వాటిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనకు మద్దతు ఇవ్వలేదు’’ అని ఔరంగజేబ్ అన్నారు.
''నాటి విషయాలు రాహుల్ మనసులో ఇప్పటికీ ఉన్నట్లు ఉన్నాయి. అందుకే బాధ్యతల నుంచి తప్పించుకునే అలాంటి సీనియర్ నాయకులకు ఆయన నేతృత్వం వహించాలని అనుకోవడం లేదు. ఆయన వెనకడుగు వేయడానికి ఇది కూడా ఒక కారణం’’ అని ఔరంగజేబ్ వివరించారు.
రాహుల్ గాంధీ వ్యక్తిత్వం
అయితే, మరికొందరు విశ్లేషకులు మాత్రం.. ''రాహుల్ గాంధీకి అధికారం మాత్రమే కావాలి. దానితో వచ్చే బాధత్యలు అవసరం లేదు’’ అని అంటున్నారు. అలా చెబుతున్న వారిలో సీనియర్ జర్నలిస్టు స్మితా గుప్తా ఒకరు.
''రాహుల్ రాజకీయ ప్రస్థానం 2004లో మొదలైంది. ఆ ఏడాది అమేఠీ పార్లమెంటరీ నియోజకవర్గంలో గెలిచి, ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు. అప్పటి నుంచే రాహుల్ పార్టీ అధ్యక్షుడు అవుతారని వార్తలు వచ్చాయి. కానీ, దానికి ఆయన అంత త్వరగా అంగీకరించలేదు’’ అని స్మిత చెప్పారు.
2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు తీసుకున్నారు. 2017లో అధ్యక్షుడు అయ్యారు. 2019లో ఈ పదవికి రాజీనామా చేశారు.
2004లో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టినప్పుడు.. క్యాబినెట్లో చేరేందుకు రాహుల్ గాంధీకి కూడా ఆహ్వానం అందించింది. కానీ, ఆ అవకాశాన్ని కూడా రాహుల్ తిరస్కరించారు.
''ఈ ఘటనలన్నీ పరిశీలిస్తే, ఆయన వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది. అధికారికంగా బాధ్యతలను తీసుకునేందుకు ఆయన మొదట్నుంచీ వెనకడుగు వేస్తూనే ఉన్నారు. అది ఆయన వ్యక్తిగత్వం’’ అని స్మిత అన్నారు.
పార్టీ పనులు..
ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలని స్మిత అంటున్నారు.
''2019లో రాజీనామా చేసినప్పటికీ, ఇప్పటివరకు పార్టీలో అన్ని కీలకమైన నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారు. అంటే పార్టీలో తన మాట చెల్లాలని ఇప్పటికీ ఆయన కోరుకుంటున్నట్లు దీని బట్టి తెలుస్తోంది’’ అని ఆమె అన్నారు.
''అధ్యక్ష పదవిని చేపట్టకపోయినప్పటికీ, వెనుక సీటులో కూర్చుని బండిని నడపాలని రాహుల్ ప్రయత్నిస్తున్నారు’’ అని స్మిత వ్యాఖ్యానించారు.
''ఉపాధ్యక్ష పదవిని చేపట్టినప్పటి పరిస్థితులను గమనిస్తే, పార్టీలో రాహుల్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, పార్టీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అవసరమైన నిబద్ధత, కఠోర శ్రమ ఆయనలో ఇప్పుడు కనిపించడం లేదు’’ అని ఆమె చెప్పారు.
- రాహుల్ గాంధీ: మోదీని ఢీకొని ప్రధాని పదవి సాధించగలరా...
- కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి 5 కారణాలు
గాంధీ కుటుంబం బయట నుంచి..
అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నప్పుడే, తర్వాతి అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవాలని రాహుల్ సూచించారు. అందుకే ఆయన ఎలాంటి పేర్లనూ ముందుకు తీసుకురాలేదు.
దీన్నిబట్టి గాంధీ కుటుంబం బయట నుంచి పార్టీ అధ్యక్షుడు రావాలని ఆయన భావిస్తూ ఉండొచ్చు.
2019 నుంచి ఈ విషయంలో రాహుల్ వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదు. బహిరంగ వేదికలపైనా ఆయన దీని గురించి మాట్లాడటం లేదు.
ఇప్పుడు రాహుల్ మళ్లీ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తే, తన మాటకు తానే ఎదురువెళ్లినట్లు అవుతుంది.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీలోని సీనియర్ నాయకులంతా కాంగ్రెస్ను కుటుంబ పార్టీగా విమర్శిస్తున్నారు. బయట వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా తీసుకురావడంతో కొంతవరకు ఈ విమర్శలకు చెక్ పెట్టొచ్చు.
అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలకు అర్థం ఏమిటి?
అయితే, గాంధీ కుటుంబం బయటి వ్యక్తులు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టే అంశంపై అశోక్ గహ్లోత్ సోమవారం మాట్లాడారు.
''గాంధీ కుటుంబం లేదా గాంధీయేతర కుటుంబం అని వివాదం ఎందుకు సృష్టిస్తున్నారు. గత 32 ఏళ్లుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రి కాలేదు. మరి ఎందుకు మోదీ భయపడుతున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
అయితే, ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీనే స్వీకరించాలని స్మితా గుప్త అంటున్నారు. ''అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలను పరిశీలిస్తే, కాంగ్రెస్లో ఎవరూ రాహుల్కు సవాల్ విసరాలని భావించలేనట్లు తెలుస్తోంది’’ అని స్మిత అన్నారు.
రాహుల్ మళ్లీ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇదే సరైన సమయం కూడా. ఎందుకంటే జీ-23 నాయకులు నెమ్మదిగా విడిపోతున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే పార్టీని విడిచిపెట్టారు. ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్లలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకున్నప్పటికీ, సదరు వ్యక్తి పూర్తికాల అధ్యక్షుడిగా కొనసాగాలని జీ-23 భావిస్తోంది. పార్ట్టైమ్ అధ్యక్షుడు తమకు వద్దని చెబుతోంది.
''ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరు సీనియర్ గాంధీలనూ విచారిస్తున్నారు. ఇలాంటప్పుడు పార్టీలో గాంధీలు లేకపోతే.. ఇది మరింత ముప్పుగా మారే అవకాశముంది’’ అని స్మిత అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)