Indo-China clash:మన జవాన్లు ఎందుకు తుపాకులు వాడలేదు..? జైశంకర్ ఏం చెప్పారు..?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నప్పుడు జవాన్లు ఎందుకు ఆయుధాలు లేకుండా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయుధాలు లేని సమయంలో చూసి చైనా భారత జవాన్లను దెబ్బకొట్టి దిద్దుకోలేని తప్పు చేసిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆయుధాలు లేకుండా సరిహద్దుల్లోకి జవాన్లను ఎవరు పంపారు అనేది తెలియాలని దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను పలు టీవీ ఛానెళ్లు నిర్వహించిన చర్చల్లో అడుగగా... దీనికి సమాధానం భారత్ -చైనా మధ్య జరిగిన ఒప్పందాల్లోనే దొరుకుతుందని చెప్పారు.
ఒప్పందం వల్లే...
ఇక రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానం చెప్పారు. భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి ఏదీ దాచలేదని అన్నీ బహిరంగ పర్చామని జైశంకర్ చెప్పారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు కచ్చితంగా ఆయుధాలు కలిగి ఉంటారని వివరించారు. జూన్ 15న అంటే ఘర్షణ జరిగిన సమయంలో కూడా జవాన్లు ఆయుధాలు కలిగి ఉన్నారని జైశంకర్ గుర్తు చేశారు. అంతేకాదు భారత్ - చైనా బలగాలు తుపాకులు వినియోగించకూడదని ద్వైపాక్షిక ఒప్పందంలో ఉందని చెప్పారు. 1993లో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలోనే తుపాకులు వినియోగించరాదనేది ఉందని గుర్తు చేశారు. ఆ సమయంలో పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్నారని చెప్పారు. 1988లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ చైనా పర్యటనకు వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందనేదానిపై పీవీ నరసింహారావు ఆరా తీసి 1993లో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు.
1993 ఒప్పందంలో ఏముంది..
అప్పటి భారత ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ చైనా పర్యటనకు వెళ్లగానే అప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వివాదం కాస్త చల్లబడిందని జైశంకర్ గుర్తుచేశారు. 1954లో నెహ్రూ ప్రధాని హోదాలో చైనాలో పర్యటించిన తర్వాత 1988లో రాజీవ్ గాంధీ పర్యటించారని ఆ మధ్యలో మరే భారత ప్రధాని చైనాలో పర్యటించలేదు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాలు తుపాకులు కానీ ఇతర ఆయుధాలు కానీ వినియోగించడం లేదా బెదిరించడం కానీ చేయరాదని 1993 ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక వేళ ఒక దేశ సైనికుడు వాస్తవాధీన రేఖను దాటి మరో దేశంలోకి ప్రవేశిస్తే వారిని వెంటనే వెనక్కు రప్పించాలనేది ఒప్పందంలో ఉందని గుర్తుచేశారు. అంటే దీనర్థం ఇరు దేశాలు శాంతితో వ్యవహరించాలని జైశంకర్ గుర్తు చేశారు.
Recommended Video
దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో మరో ఒప్పందం
ఇక ఈ ఒప్పందంకు కొనసాగింపుగా 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో మరో ఒప్పందం భారత్ చైనాల మధ్య జరిగింది. ఒకవేళ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటే సైనికులు స్వీయ నియంత్రణలో ఉండి వెంటనే చర్చలు చేపట్టాలనేది దీని సారాంశం. అయితే భారత సైనికులు అక్కడ ఆయుధాలు లేకుండా ఎలా ఉన్నారనేది ఆర్టికల్ 6 వివరిస్తుంది. వాస్తవాధీన నియంత్రణ రేఖ రెండు కిలోమీటర్ల పరిధిలో ఇరు దేశాలకు సంబంధించిన సైనికులు ఎట్టి పరిస్థితుల్లో తుపాకులతో కాల్పులు జరపడం కానీ, ఇతర పేలుడు పదార్థాలు వినియోగించడం కానీ చేయరాదనేది అందులో ఉంది. ఈ ఒప్పందం ఉండటం వల్లే భారత్ -చైనా సరిహద్దుల్లో ఏదైనా ఘర్షణ వాతావరణం వస్తే ఇరు దేశాల సైనికులు తమ భుజాలతో తోసుకోవడం కానీ భౌతిక దాడులకు దిగడం కానీ చేస్తుంటారు. ఇవే వీడియోలు మనకు చాలా సార్లు దర్శనమిచ్చాయి.
తాజాగా గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ వల్ల ప్రోటోకాల్స్లో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దాడులు మించిపోయినట్లయితే కాల్పులకు తెగబడేందుకు ప్రభుత్వం అనుమతిచ్చేలా మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.