ఉల్లంఘిస్తే తగిన గుణపాఠం: పాక్కి రాజ్నాథ్ వార్నింగ్
నాసిక్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మళ్లీ ఉల్లంఘిస్తే వారికి భారత సైన్యం ఖచ్చితంగా సరైన గుణపాఠం చెబుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాక్ దాడులకు ధీటుగా సమాధానమిస్తామని తెలిపారు. కుంభమేళా ప్రారంభోత్సవంలో భాగంగా నాసిక్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
పాక్కి భారత ఆర్మీ సరైన సమాధానం చెబుతుందన్నారు. కాశ్మీర్ భారత్లో ఒక భాగమని ఆయన స్పష్టం చేశారు. ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ విడుదల విషయం, ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ల భేటీ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. మోడీ ఇరు దేశాల స్నేహబంధం కొనసాగేందుకు ప్రయత్నించారని రాజ్నాథ్ అన్నారు.
కాగా, వ్యాపం కుంభకోణంతో విమర్శపాలైన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన క్లీన్ చీట్ ఇచ్చారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. తమపై బురద చల్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
కుంభమేళ సందర్భంగా భారతదేశం సుసంపన్నంగా ఉండాలని భగవంతుడ్ని కోరుకున్నట్లు రాజ్నాథ్ తెలిపారు. రాజ్నాథ్ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రులు గిరీష్ మహాజన్, సుధీర్ ముంగటివార్, అధికారులు, బిజెపి నేతలు పాల్గొన్నారు.