కుమారస్వామి రాజీనామా ? తూచ్ కాదు.. సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఖండించిన సీఎం
బెంగళూరు : కర్నాటకీయం చివరి అంకానికి చేరింది. బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కేఆర్ రమేశ్ కూడా సానుకూలంగా ఉన్నారు. దీంతో తెల్లవారుజాము వరకు సభ నిర్వహిస్తానని స్పీకర్ ప్రకటించడంతో బెంగళూరులోని విధాన సౌధ ప్రాంగణంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
మైనార్టీలో ప్రభుత్వం ..
16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో బీజేపీ బలపరీక్ష నిరూపించుకోవాలని గురువారం కోరింది. దీనిపై గవర్నర్ కూడా కల్పించుకున్నారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, స్పీకర్ రమేశ్ను ఆదేశించారు. అయినప్పటికీ వారిద్దరూ గవర్నర్ ఆదేశాలను బేఖాతరు చేశారు. దీంతో సభను సోమవారం వరకు వాయిదా వేసి .. బలపరీక్ష నిర్వహిస్తామని సమయం మారుస్తూ ఉండటంతో క్షణ క్షణం రాజకీయాలు మారుతున్నాయి.
రాజీనామా.. కాదు తూచ్...
శుక్రవారం రోజున తాము బలపరీక్షకు సిద్ధమని సీఎం కుమారస్వామి చెప్పిన విషయాన్ని బీజేఎల్పీ నేత యడ్యూరప్ప గుర్తుచేశారు. తాము సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటామని .. బలం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తాము విశ్వాస పరీక్ష చర్చలో పాల్గొనేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్కే పాటిల్ మాట్లాడుతూ .. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్తుందని గుర్తుచేశారు. అప్పుడే బలపరీక్ష పెడితే బాగుంటుందని సూచించారు. కానీ ప్రభుత్వ వాదనలను స్పీకర్ తోసిపుచ్చారు. ఇప్పటికే తాను సహనంతో వేచిచ చూశానని .. ఇక తన ఓపికన పరీక్షించొద్దని కోరారు. మీరు ఈ విధంగా చూస్తే ఇక నేను మిమ్మల్ని అడక్కుండానే నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించారు. మరోవైపు కర్ణాటక సీఎం కుమారస్వామి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతుంది. ఆయన టేబుల్పై రాజీనామా ప్రతి ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై సభలో కుమారస్వామి స్పందించారు. తాను రాజీనామా చేయలేదని, అలా ఎవరే అసత్య ప్రచారాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.