ఇప్పుడు పెట్టు "నమస్తే ట్రంప్ " కార్యక్రమం: మోడీపై చిదంబరం సెటైర్
కరోనావైరస్ కేసుల వాస్తవ సంఖ్యను భారత్ దాచిపెడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు మాజీ కేంద్రమంత్రి చిదంబరం. ట్రంప్ ఇంతలా చెప్పాక కూడా భవిష్యత్తులో ప్రధాని మోడీ మరోమారు నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఎద్దేవా చేశారు. రష్యా చైనా దేశాలతో భారత్ను కలుపుతూ భారత్ కూడా కరోనావైరస్ మరణాల సంఖ్యను దాచి ఉంచిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు ట్విటర్లో గుర్తు చేశారు చిదంబరం. అంతేకాదు ఈ కాలుష్యం పెరుగుదల, వాతావరణంలో మార్పునకు ఈ మూడు దేశాలే కారణమని డొనాల్డ్ ట్రంప్ అన్నారని చిదంబరం చెప్పారు. ఈ సమయంలో తన మిత్రుడైన ట్రంప్తో కలిసి మరో నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నిర్వహిస్తారా అని ప్రశ్నించారు చిదంబరం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బుధవారం ట్రంప్-బిడెన్ల మధ్య జరిగిన తొలి డిబేట్లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అంతేకాదు అభ్యర్థులిద్దరూ కరచాలనం చేసుకోకపోవడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా వైరస్ పై చర్చ జరిగిన సందర్భంగా ట్రంప్ చైనా రష్యా భారత్లపై నిప్పులు చెరిగారు. అమెరికాలో కరోనావైరస్ను కట్టడి చేయడంలో ట్రంప్ సర్కార్ విఫలమైందని బిడెన్ చెప్పినప్పుడు ఏ దేశం వాస్తవ సంఖ్యను వెల్లడించడం లేదని ట్రంప్ అన్నారు.
Recommended Video
ఈ ఏడాది ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్ పేరుతో అహ్మదాబాదులో ప్రధాని మోడీ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది అతిథులు, ప్రముఖులు హాజరయ్యారు. ఆ సమయంలో ట్రంప్ మోడీపై ప్రశంసలు కురిపించగా ప్రధాని మోడీ కూడా అమెరికా అధ్యక్షుడిని పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికా భారత్ను ప్రేమిస్తోందని, భారత్ను గౌరవిస్తుందని, ఇరు దేశాలు పూర్తి విశ్వాసంతో మెలుగుతాయని ట్రంప్ చెప్పారు. అంతే కాదు రక్షణ రంగంలో కూడా మూడు బిలియన్ డాలర్ల మేరా ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని చెప్పారు. ఇక ప్రధాని మోడీ మంచి సంబంధాలు నెరిపారని త్వరలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు.