చెప్పాకే: టీపై డిగ్గీ, నక్సల్స్ సమస్య ఉండదు: షిండే
ఇండోర్/ న్యూఢిల్లీ: పార్టీ అధిష్టానం నిర్ణయం ఏదైనా కట్టుబడి ఉంటామని ఇరు ప్రాంతాల నాయకులు చెప్పిన తర్వాతనే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తాను సీమాంధ్ర, తెలంగాణ నాయకులతో మాట్లాడానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారని, ఆ తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఎన్ని అవాంతరాలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే తాము తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్పాయని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీలు అభిప్రాయాలు మార్చుకున్నప్పటికీ తాము తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గబోమని ఆయన అన్నారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, మంత్రుల రాజీనామాలను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తేలిగ్గా తీసుకున్నారు. ఇటువంటివి సహజమేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నక్సలైట్ సమస్య తలెత్తదని ఆయన అన్నారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ మంత్రి వర్గ సహచరులు కొన్ని ఆక్షేపణలు తెలిపారని, వాటిని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు.
నక్సలిజాన్ని అణచివేయడంలో అద్భుతంగా పనిచేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నక్సలైట్ సమస్య తలెత్తదని ఆయన అన్నారు. సీమాంధ్రలో కూడా నక్సలిజం తగ్గుతుందని షిండే అన్నారు. విభజన జరిగిన తర్వాత నక్సలైట్ సమస్యను ఎదుర్కుంటారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.