13న మరో కీలక తీర్పును ఇవ్వనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రేపు(బుధవారం) మరో సంచలన తీర్పునకు సిద్ధమవుతోంది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న కేసుపై నవంబర్ 13న సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది.
సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం 'ప్రభుత్వ సంస్థలే' అని, అవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తీర్పును రిజర్వులో పెట్టింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించనుంది.
ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖాన్నా సభ్యులుగా ఉన్నారు. నవంబర్ 2017లో ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్.. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు కావాలంటూ ఆర్టీఐ దాఖలు చేశారు. అది నిరాకరించడంతో ఆయన కేంద్ర సమాచార కమిషన్ను ఆశ్రయించారు.
ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్టీఐ చట్టం కిందకు వస్తుందని, వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టును కోరింది కేంద్ర సమాచార కమిషన్. జడ్జీల వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించలేమని ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలిపింది.
సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వివరాలు కూడా ఆర్టీఐ కింద వెల్లడించాలని సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. దీంతో సుప్రీంకోర్టు ఆ తీర్పును రిజర్వులో ఉంచింది. బుధవారం ఆ అంశంపై కీలక తీర్పును వెలువరించనుంది.