మోదీ సర్కార్ సంచలన ఆదేశాలు: Section 66A Of IT Act కేసులన్నీ రద్దు -కొత్తవి వద్దు -భారీ ఊరట
విమర్శకులు లేదా అసమ్మతిదారుల గొంతు నొక్కేందుకు ఇన్నాళ్లుగా ప్రభుత్వాలు ఒక ఆయుధంగా వాడుకుంటోన్న 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 సెక్షన్ 66ఎ'కి సంబంధించి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఏనాడో, ఏడేళ్ల కిందటే కొట్టేసినప్పటికీ, ఇప్పటిదాకా దానిని అమలు చేస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడా వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేసింది..
దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000 సెక్షన్ 66ఎ కింద నమోదైన అన్ని కేసులను ఎత్తివేయాలంటూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోదీ సర్కార్ సూచించింది. అంతేకాదు, ఐటీ సెక్షన్ 66ఏ కింద కొత్తగా ఎలాంటి కేసులూ నమోదు చేయరాదనీ కేంద్రం ఆదేశించింది.

రెండంచుల పదునుగల కత్తి లాంటి ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఏను సోషల్ మీడియాలో విశృంఖలత్వానికి, వివాదాస్పద ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించినప్పటికీ, అమలులో మాత్రం అది పూర్తిగా దారి తప్పింది. అధికార పార్టీలు ఐటీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని సాధారణ పౌరులు, ప్రత్యర్థులు, అసమ్మతిదారుల, విమర్శకులపై ఇష్టారీతిగా కేసులు బనాయించిన దాఖలాలు కోకొల్లలు. చిన్న కార్టూన్ గీసినందుకు కూడా ఈ చట్టం కింద అరెస్టులు చోటుచేసుకోవడం తెలిసిందే.
ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లోనే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ మేరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. కాగా,
సుప్రీం తీర్పు వెలువరించిన తర్వాత దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1,307 కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఇటు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతానికి ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 740కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications