ఆడబిడ్డ పుట్టింది, వరకట్నం కోసం బాలింత వదినను చావబాదిన మరిది (వీడియో)
పాటియాల: వరకట్నం కోసం బాలింతపై మరిది దాడి చేసిన ఘటన పంజాబ్ లోని పాటియాలలో జరిగింది. ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురాలేదని ఆరోపిస్తూ భర్త సోదరుడు తన స్నేహితుడితో కలిసి బాలింత అయిన వదినను కర్రలతో దారుణంగా చితకబాదేశారు.
పాటియాలకు చెందిన దల్ జిత్ సింగ్ కు ఓ మహిళతో రెండు సంత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి భర్త ఇంటి కుటుంబ సభ్యులు వరకట్నం తీసుకురావాలని ఆమెను వేధింపులకు గురి చేశారు. ఇటీవల ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
వరకట్నం తీసుకురాలేదని, ఆడబిడ్డకు జన్మనిచ్చిందని దల్ జిత్ సింగ్ కుటుంబ సభ్యులు మరింతరెచ్చిపోయారు. దల్ జిత్ సింగ్, ఆమె భార్యను వేరేవేరు గదుల్లో పెట్టారు. ఇద్దరినీ కలవకుండా చేశారు. అంతటితో అత్తంటివారు ఊరుకోలేదు.
దల్ జిత్ సింగ్ సోదరుడు తన స్నేహితుడిని ఇంటికి పిలుచుకుని వచ్చి వదిన మీద కర్రలతో దారుణంగా దాడి చేశారు. నీ కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపో, లేదంటే వరకట్నం తీసుకురా అంటూ బాలింతను చితకబాదేశారు. బాలింత మీద దాడి చేస్తున్న దృశ్యాలు అదే ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సీసీ కెమెరాల క్లిప్పంగ్స్ ను బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు దల్ జిత్ సింగ్ సోదరుడు, అతని స్నేహితుడి మీద కేసు నమోదు చేశారు. వదిన మీద దాడి చేసిన మరిది, అతని స్నేహితుడు పరారైనారని పోలీసులు అన్నారు. బాధితురాలి కథనం మేరకు కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.