వాళ్లే మా తల్లిని చంపేశారు.. ఆటోలోనే చనిపోయిన మహిళ... ఫుట్పాత్పై బోరున విలపించిన కుమారుడు...
హృదయ విదారకం కాదు... అంతకుమించి... భారత్లో కరోనా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ చేసిన కామెంట్ ఇది. క్షేత్రస్థాయిలో కోవిడ్ పరిస్థితులు... అది మిగులుస్తున్న విషాదాలు మాటలకు అందనివి. తోడబుట్టినవాళ్లు,కడుపున పుట్టినవాళ్లు,ఆత్మీయులు కరోనాకు బలైపోతుంటే కడసారి చూపుకు కూడా నోచుకుని స్థితిలో ఎంతోమంది గుండెలవిసేలా రోధిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రి బయట నిస్సహాయ స్థితిలో ఓ యువకుడు బోరున ఏడుస్తూ కనిపించాడు. గంటల పాటు నిరీక్షించిన ఆస్పత్రిలో బెడ్ దొరక్క తన తల్లి చనిపోవడంతో కన్నీటిపర్యంతమయ్యాడు.
అసలేం జరిగింది...
ఢిల్లీకి చెందిన ముకుల్ వ్యాస్(28) తల్లి కిరణ్ వ్యాస్(52) ఇటీవల కరోనా బారిన పడింది. మంగళవారం(ఏప్రిల్ 26) ఉదయం కిరణ్ వ్యాస్ను ఆమె కుమారులు సౌత్ ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్కి ఆటోలో తీసుకొచ్చారు. అయితే అప్పటికీ ఇంకా ఆస్పత్రి గేట్లు తెరవలేదు. దీంతో మూడు గంటల పాటు ఆస్పత్రి గేటు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. అప్పటికి ఆ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆటోలోనే మృతి చెందింది.
ఫుట్పాత్పై కన్నీటిపర్యంతం...
కిరణ్ వ్యాస్ శ్వాస ఆగిపోవడంతో వెంటనే ఆమె కుమారుడు రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కుతూ ఆమెను బతికించే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే ఆమె కన్నుమూసింది. తల్లి మృతదేహాన్ని చూసి ముకుల్ వ్యాస్,అతని సోదరుడు కన్నీటిపర్యంతమయ్యారు. ఫుట్పాత్పై కూర్చొని ముకుల్ వ్యాస్ బోరున విలపించాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తమ తల్లి ప్రాణాలను బలితీసుకుందని ఆరోపించారు.
వాళ్లే మా తల్లిని చంపేశారు...
'వాళ్లే మా తల్లిని చంపేశారు. ఇప్పుడామెను ఎక్కడికి తీసుకెళ్లాలి. ఆస్పత్రి బయటే మేము గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఓవైపు ఆమె పరిస్థితి విషమిస్తుంటే... మరోవైపు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని చెప్పారు. ఎవరైనా చొరవ తీసుకుని తమకు సాయం చేయాలని వేడుకున్నాను. అయినా లాభం లేకపోయింది. ఇప్పుడు మా తల్లి చనిపోయింది.' అని ముకుల్ వ్యాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.'జిల్లా సర్వైలెన్స్ అధికారి నుంచి రిఫరెన్స్ తీసుకొస్తేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామన్నారు. ఓవైపు మనిషి చనిపోతుంటే... 100 ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి సమయం ఎక్కడుంటుంది. ఒక్కరూ మాకు సాయం చేయలేదు.' అని వాపోయాడు.
నిండిపోయిన ఐసీయూ బెడ్స్
ఢిల్లీలో దాదాపుగా అన్ని ఆస్పత్రులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోయాయి. దీంతో కొత్తగా వైరస్ బారినపడుతున్నవారికి ఎక్కడా బెడ్ దొరకని పరిస్థితి నెలకొంది. రాధా సోమి సత్సంగ్ కోవిడ్ సెంటర్ వద్ద మంగళవారం(ఏప్రిల్ 27) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు విపరీతమైన రద్దీ కనిపించింది. బెడ్ల కోసం కోవిడ్ పేషెంట్ల కుటుంబ సభ్యులు,బంధువులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసినా బెడ్ కేటాయించేందుకు గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోందని పేషెంట్ల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లన్నీ ఇప్పటికే నిండిపోయాయి. మరో 1200 బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.