ఆభరణాలకు బదులు టాయిలెట్ కావాలని కోరిన మహిళకు 10 లక్షల నజరానా
న్యూఢిల్లీ: పెళ్లికానుకగా జ్యూయలరీకి బదులు టాయిలెట్ కావాలని కోరిన మహారాష్ట్రకు చెందిన అమ్మాయికి రూ. 10 లక్షల బహుమతిని ఆదివారం ప్రకటించారు. మహారాష్ట్రలోని అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవలే పెళ్లి జరిగింది.
అత్త వారింట్లో టాయిలెట్ లేదన్న సంగతి తెలుసుకొని, ఇంట్లో ఖచ్చితంగా టాయిలెట్ ఉండాల్సిందేనని పెళ్లికి ముందే స్పష్టంగా చెప్పడంతో వారు టాయిలెట్ని నిర్మించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మంకగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆకర్షితురాలైన ఆమె పారిశుధ్య అవసరాలకు టాయిలెట్ అత్యంత ముఖ్యమైందని తండ్రి చెప్పింది.
దీంతో ఆమె తండ్రి అన్ని వసతులు కలిగి ఉన్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు చైతలీకి రూ. 10 లక్షల నగదు బహుమతి ఆదివారం ప్రకటించారు.
అంతే కాదు ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆకర్షితురాలైన చైతలీని వారు అభినందించారు. వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం భారత్లో 53 శాతం మంది మహిళలు టాయిలెట్కు బహిర్భూమికి వెళ్తున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది.