మహిళ ప్లాన్పై ప్లాన్: ప్రియుడితో కలిసి భర్త హత్య
బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో శతవిధాల ప్రయత్నించి చివరికి కట్టుకున్న భర్తను హత్య చేయించిన భార్యను కర్ణాటకలోని తుమకూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తుమకూరులోని మరళూరు దిన్నెలో నివాసం ఉంటున్న ఇర్షాద్ బాను (35) అనే మహిళను అరెస్టు చేశారు.
ఇర్షాద్ బాను ప్రియుడు, అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అక్రమ్ బాష(40), ఇర్షాద్ బాను (35) దంపతులు. ఇర్షాద్ బానుకు షబ్బీర్ (27) అనే ప్రియుడు ఉన్నాడు.
ప్రియుడితో కలిసి జీవించడానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని ఇర్షాద్ బాను భావించింది. ఎలాగైనా భర్తను అంతం చెయ్యాలని ప్లాన్ వేసింది. జూన్ 6వ తేదిన దర్గాకు వెళుదామని భర్తకు చెప్పింది. ఇద్దరు కలిసి ఆటోలో తుమకూరు సమీపంలోని జైపూర పాళ్యలోని దర్గాకు వెళ్లి పూజలు చేశారు.
తరువాత దర్గాలో నుండి బయటకు వచ్చారు. ఆటో దగ్గరకు నడిచి వెళుతున్న సమయంలో ఇర్షాద్ బాను కొద్దిగా ఆలస్యం చేసింది. అదే సమయంలో బాను ప్రియుడు షబ్బీర్, అతని బంధువు తౌషిక్ కారులో వేగంగా వచ్చి ముందు నడిచి వెళుతున్న అక్రమ్ ను డీకొట్టి వెళ్లి పోయారు.

తరువాత బాను తీవ్రగాయాలైన భర్తను ఆటోలో తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ అక్రమ్ కొలుకుంటున్నాడు. అయితే తన భర్త చనిపోడని భాను తెలుసుకుంది. బెంగళూరులో తన భర్తకు చికిత్స చేయిస్తామని అక్కడి డాక్టర్లుకు చెప్పి జూన్ 13వ తేది డిశ్చార్జ్ చేయించింది.
అక్కడి నుండి ఆటోలో డాబస్ పేట చేరుకున్నారు. అదే సమయంలో బాను ప్రియుడు షబ్బీర్, అతని బంధువు తౌషిక్ క్వాలిస్ వాహనంలో అక్కడికి వచ్చారు. అదే కారులో అక్రమ్ ను పిలుచుకుని బెంగళూరు బయలుదేరారు. మార్గం మద్యలో తాడు తీసుకుని అక్రమ్ గొంతు బిగించి హత్య చేశారు.
తరువాత ఆటోలో భర్త శవం పెట్టుకుని ఇంటికి వెళ్లిన బాను రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని బంధువులు, పోలీసులను నమ్మించింది. పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోస్టుమార్టుం నివేదికలో గొంతు బిగించడం వలనే అక్రమ్ మరణించాడని వైద్యులు నివేదిక ఇచ్చారు. పోలీసులు బానును అదుపులోకి తీసుకుని బెండ్ తీయ్యడంతో అసలు విషయం అంగీకరించింది. పరారైన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications