లైంగిక వేధింపులు: తండ్రిని హత్య చేసిన కూతురు
న్యూఢిల్లీ: నిద్రలో ఉన్న తన తండ్రిని ఓ కూతురు అత్యంత దారుణంగా హత్య చేసింది. తనపై గత మూడేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత యువతి తన తండ్రిని హత్య చేసింది. ఇందుకు తన ఇద్దరు స్నేహితుల సహకారం తీసుకుంది. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందిత యువతి తన తండ్రి(56) నిద్రిస్తున్న సమయంలో క్రికెట్ వికెట్తో చితకబాదింది. అంతకుముందే అతని చేతులు, కాళ్లను తీగతో కట్టేసింది. అతడు చనిపోయే వరకు కర్రతో బాదుతూనే ఉంది. మృతి చెందిన తర్వాత అతని మృతదేహాన్ని ఆమె తన ఇద్దరు స్నేహితుల సహాయంతో ఇన్నోవాలో తరలించారు. కొన్ని కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత ఓ మురుగు కాలువలో మృతదేహాన్ని పడేశారు. ఆధారాలు దొరకకుండా నిందితులు గ్లావ్స్ వాడారని పోలీసులు తెలిపారు.
అయితే విచారణ జరిపిన పోలీసులు 72 గంటల్లోనే ఈ హత్య కేసును ఛేదించారు. నిందిత యువతి, తన ఇద్దరు స్నేహితులు ప్రిన్స్ సంధు, అశోక్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధు టట్టూ సెలూన్ నడుపుతుండగా, అశోక్ శర్మ సేల్స్ బాయ్స్గా విధులు నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు.
మూడేళ్ల క్రితం నిందిత యువతి తల్లి చనిపోయిందని చెప్పిన పోలీసులు, అప్పట్నుంచి ఆమె తండ్రి ఆమెను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. యువతికి ఇద్దరు సోదరీమణులు ఉన్నప్పటికీ వారికి వివాహం కావడంతో వారు అత్తవారింటికి వెళ్లిపోయారు. తన తండ్రి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి, తన స్నేహితులతో కలిసి అతన్ని హత్య చేసిందని పోలీసులు తెలిపారు.