జోరు వాన .. నిండిన సబ్ వే ... కాపాడాలని విదేశీ మహిళ ఆర్తనాదాలు
ముంబై : వర్షాకాలం వచ్చిందంటే చాలు ముంబైకర్లు వణికిపోతారు. వరద ప్రవాహం బెంబేలెత్తిపోతుంటారు. మళ్లీ రానే వచ్చింది వర్షాకాలం. ఇవాళ ఉదయం నుంచి ముంబైలో వర్షం కురుస్తోంది. ఇంకేముంది రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇక సబ్ వే, కుంటలు, లోతట్టు ప్రాంతాల సంగతి సరేసరి. వర్షం నీటితో నిండిపోయి .. ఇది రహదారులా లేదా నదులా అనే అనుమానం కలిగిస్తోంది.
వామ్మో .. వర్షం ..
పక్క ఫోటోలో కనిపిస్తోన్న మహిళ ఆందేరి సబ్ వేలో చిక్కుకున్నారు. అయితే అక్కడే ఉన్న స్థానికులు చేయూతనివ్వడంతో .. నిండుకుండలా మారిన సబ్ వే నుంచి బయటపడ్డారు. అయితే ఆమెది ముంబై కాదు .. మలేషియా. చుట్టపు చూపుగా ముంబై వస్తే .. వరణుడు భయభ్రాంతికి గురిచేశాడు. ఇవాళ ఉదయం నుంచి కురిసిన వర్షంతో వరదనీటితో సబ్ వే నిండిపోయింది. అయితే అటుగా వెళ్తున్న మహిళ అందులో చిక్కుకొని ఆదుకోవాలని కేకలు వేసింది వెంటనే స్పందించిన స్థానికులు సాయం చేశారు. ఓ వ్యక్తి సబ్ వే వద్ద నుంచి మహిళను రోడ్డుపైకి పంపించగా .. మరో ఇద్దరి సాయంతో ఆమె క్షేమంగా బయటకు వచ్చారు.

భయాందోళన ...
బయటకు వచ్చిన తర్వాత ఆ మలేషియా మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. తొలిసారి ముంబై వస్తే ప్రాణసంకటంగా మారిందని భయపడ్డారు. ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో ముంబై .. జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయిన పరిస్ధితి. దీంతోపాటు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కొన్ని రైళ్లను కూడా నిలిపివేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
పరిస్థితిని బట్టి వాటి సమయం మార్చడమో .. లేదంటే క్యాన్సిల్ చేశామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే మరోవైపు శనివారం కూడా ముంబైలో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ముంబై వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో అధికార యంత్రాంగం వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications