భర్తను దారుణంగా చంపేసిన భార్య
న్యూఢిల్లీ: కుటుంబ గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెందిన భార్య ఆమె భర్తను అతి దారుణంగా హత్య చేసింది. హత్య చేసిన ఆమెను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ డీసీపీ సురేందర్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. వీరేందర్ (50), మిథిలేషి (45) దంపతులు నైరుతి ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. వీరేందర్ మద్యంకు బానిస అయ్యాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను వేదించేవాడు. మద్యం తాగడం నిలిపివేయాలని అతని భార్య చాల సార్లు చెప్పింది.
అయితే అతను మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఇంకా ఎక్కువ మద్యం సేవించి ఇంటికి వెళ్లేవాడు. ఇదే విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగేది. ఇక లాభం లేదని నిర్ణయించుకున్న మిథిలేషి ఎలాగైనా భర్తను అంతం చెయ్యాలని ప్లాన్ వేసింది. అందు కోసం వేచి చూసింది.
గురువారం వీరేందర్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. తరువాత భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లి పోయాడు. మిథిలేషి కత్తి తీసుకుని భర్తను అనుసరించింది. దయాల్ పార్క్ దగ్గర భర్తను అడ్డగించి కత్తితో పలు సార్లు దారుణంగా పొడిచింది. తీవ్రగాయాలై అతను అక్కడే మరణించాడని, కేసు దర్యాప్తులో ఉందని డీసీపీ సురేందర్ కుమార్ తెలిపారు.