అందరిముందు బట్టలు విప్పి కొట్టారు: మహిళ అదృశ్యం
కాగా, దుస్తులు విప్పేసి ఓ నడి వయస్సు మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిన విషయం తెలిసిందే. బీహార్ రాష్ట్రంలోని జెహనాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. ఈ గ్రామం రాష్ట్ర రాజధానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
జులై 16, 17 తేదీల మధ్య రాత్రి ఒంటి గంటన్నర సమయంలో ఆ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సంగీతా దేవిని బయటకు ఈడ్చుకొచ్చారు. తొలుత వారు మహిళ ఇంట్లో దౌర్జన్యానికి దిగారు, ఆమె దస్తులు విప్పేశారు, తన్నారు, పిడిగుద్దులు గుద్దారు. అందరు చూస్తుండగానే ఇది జరిగిందట.
ఆ మహిళను రక్షించడానికి ఎవరు ఏ విధమైన ప్రయత్నం కూడా చేయలేదట. సంగీతా దేవితో భూలావాదేవీలు పెట్టుకున్న శక్తి సింగ్ అనే స్థానిక యువకుడి అపహరణకు గురైన నేపథ్యంలో ఆమెపై ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. మహిళకు అపహరణలో పాత్ర ఉందనే అనుమానంతో దురాగతానికి పాల్పడినట్లు చెబుతున్నారు. సంగీతాదేవి తీవ్రంగా గాయపడింది.
ఆమె పాట్నాలోని బీహార్ వైద్య కళాశాల ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటన బీహార్ అసెంబ్లీలో కూడా ప్రస్తావనకు వచ్చింది. సంఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అయితే, అంతలోనే ఆమె సోమవారం ఆసుపత్రి నుండి అదృశ్యమయింది.