దారుణం: టీచర్ను హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో కుట్టేశాడు
రాయచూరు: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఏడుళ్లుగా ప్రేమించిన ఉపాధ్యాయురాలు.. ఆ ప్రేమికుడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని మాన్వి తాలూకా సిరవార ప్రాంతంలో ఆ ప్రేమికుడు ప్రియురాలిని హత్య చేశాడు.
వివరాల్లోకి వెళితే.. వీరేశ అనే యువకుడు.. ఫర్జాన్ అనే ఉపాధ్యాయురాలు గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అధ్యాపకురాలు ఫర్జాన్ ఎంఎస్సీ బీఈడీ చదివి లింగసూగూరులోని అంబేడ్కర్ కళాశాలలో విధులు నిర్వహిస్తుండేది.
ఏడాది క్రితం జావేద్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న వీరేశ 7సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న ఫలితం లేకపోయిందని, తనకు దక్కని అధ్యాపకురాలు ఫర్జాన్ మరొకరికి దక్కకూడదని భావించి ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 21న హత్య చేసి ఓ ప్లాస్టిక్ సంచిలో కుట్టేసి సిరవర ప్రాంతంలో పడేశాడు. కాగా, వీరేశ.. తెలంగాణలోని గద్వాల వద్ద తన మొత్తం దుస్తులు సాక్ష్యం లేకుండా చేసి సోలాపూర్కు బయలుదేరాడు.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సిరవార పోలీసులు దర్యాప్తు చేశారు. విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. నిందితుడు వీరేశను అదుపులోకి తీసుకున్నారు.