దీపా కర్మాకర్పై ట్వీట్, రేప్ చేస్తామని బెదిరింపు: సుష్మ స్పందన
జైపూర్: రియో ఒలింపిక్స్ 2016లో కాంస్య పతకం తృటిలో చేజార్చుకున్న దీపా కర్మాకర్ పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఓ యువతికి బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
రాజస్థాన్లోని జయపురకు చెందిన మహిళ... దీపా కర్మాకర్ ప్రొడునోవా పైన ట్వీట్ చేసింది. ఇతర దేశాల జిమ్నాస్ట్లు ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసం చేయడం లేదని, డెత్ వాల్ట్గా పిలిచే ఈ విన్యాసాన్ని ప్రాణాలకు తెగించి ఒలింపిక్ పతకం కోసం దీప చేస్తోందని, ప్రాణం కన్నా ఏ పతకం, దేశం గొప్పది కాదని ఆమె ట్వీట్ చేశారు. అందులో దేశం ముందు 'డామ్' అనే పదం ఉపయోగించారు.
దీంతో చాలామంది ట్వీట్ చేసిన మహిళ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీప కర్మాకర్ను ఉదాహరిస్తూ తాను చేసిన ట్వీట్ కారణంగా తనను చంపుతామని, రేప్ చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఆమె వల్లడించారు. తనను లైంగికంగా వేధిస్తూ బెదిరించారని ట్విట్టర్లో పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగశాఖ మంత్రి సుష్మ స్వరాజ్ను కూడా ఈ ట్వీట్కు ట్యాగ్ చేశారు. తనకు భద్రత కల్పించాలని ఆమె కోరారు. సుష్మాస్వరాజ్ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకి రిఫర్ చేయడంతో ఆమె జోక్యం చేసుకున్నారు. పోలీసు సిబ్బందిని మహిళ ఇంటి వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.