కరోనాపై యుద్ధానికి ప్రపంచబ్యాంకు సాయం: భారత్కు బిలియన్ డాలర్ల అత్యవసర నిధులు
న్యూఢిల్లీ: భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలకు ప్రపంచబ్యాంకు వెన్నుదన్నుగా నిలిచింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్కు ఒక బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేసింది. ఎమర్జెన్సీ ఫండ్ కింద ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాాదనలపై ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమెదముద్ర వేసింది.
కరోనా కనీవినీ ఎరుగని విధ్వంసం: అమెరికాలో ఒక్కరోజే 1169 మంది బలి: న్యూయార్క్, న్యూజెర్సీ కకావికలం
మూసుకుపోయిన ఆదాయ మార్గాలు..
ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, బ్యాంకుల లావాదేవీలు, రవాణా వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా వస్తు, సేవల పన్ను రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం అందలేదు. లాక్డౌన్ వల్ల ఖజానాకు రావాల్సిన ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి.
ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి రావడం..
అదే సమయంలో- లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంటోన్న పేద కుటుంబాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటికే లక్షా 70 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీన్ని అమలు చేస్తోంది. లాక్డౌన్ వల్ల ఒకవంక లక్షల కోట్ల రూపాయల రాబడి స్తంభించడం, మరోవంక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రపంచబ్యాంకును ఆశ్రయించింది.
కేంద్రం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్..
కరోనా వైరస్ను నివారణ చర్యల కోసం ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ప్రపంచబ్యాంకునకు కొద్దిరోజుల కిందటే ప్రతిపాదనలను పంపించారు. దీన్ని ఆమోదించింది ప్రపంచబ్యాంకు. ఒక బిలియన్ డాలర్ల అత్యవసర నిధులను మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఈ ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది.
Recommended Video
25 దేశాలకు ఆర్థిక సాయం..
ఒక్క భారత్కు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఒక్కో బిలియన్ డాలర్ల చొప్పున నిధులను మంజూరు చేసింది. భారత ఉపఖండంలోని పాకిస్తాన్-200, శ్రీలంక-128.6, ఆఫ్ఘనిస్తాన్-100. మాల్దీవులు-7.3 మిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సహకారాన్ని అందజేయడానికి అంగీకరించింది. ఈ నిధులతో ఆయా దేశాలు అత్యవసర వైద్య సదుపాయాలను కల్పించడానికి, కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ప్రపంచబ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ చెప్పారు.