Yamuna Flood : కేజ్రివాల్ ఇంటి వరకూ వచ్చేసిన యమునా వరద-ఏ క్షణాన్నైనా...
ఢిల్లీతో పాటు ఎగువ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం ఇవాళ కూడా తీవ్రంగానే ఉంది. వరుసగా ఐదోరోజు కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో యమునా నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే చరిత్రలో ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసిన యమునా నది వరద ఇప్పుడు ఏకంగా ఢిల్లీలో సీఎం కేజ్రివాల్ ఇంటి సమీపానికి వచ్చేసింది. అలాగే ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న వంతెనల్ని సైతం తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్దితి.
ఢిల్లీలోని యమునా నదిలో నీటిమట్టం రాత్రి మరింత పెరగడంతో ఇళ్లు, రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుతోంది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నీటిని నదిలోకి నిరంతరాయంగా విడుదల చేస్తుండటంతో ఇవాళ ఉదయం 7 గంటలకు యమునాలో నీటిమట్టం 208.46 మీటర్లుకు చేరుకుంది. దీంతో ఇది ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్ల ఎత్తులో ఉన్నట్లు నిర్ధారించారు.
పరిస్ధితి తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రం జోక్యం చేసుకుని బ్యారేజీ నుండి నీటి విడుదలను నిలిపివేయాలని కోరింది. కానీ దీనికి కేంద్రం ఒప్పుకోవడం లేదు.

మరోవైపు రుతుపవనాలు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాన మరింత భారీ వర్షం కారణంగా బ్యారేజీ నిండిపోయింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలతో నిండిపోయింది. మజ్ను కా తిలాను కాశ్మీరీ గేట్ ఐఎస్బీటీతో కలిపే మార్గం మూసేశారు. ఈ ప్రదేశం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంది. హర్యానా బ్యారేజీ నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటి ప్రవాహం తగ్గుతుందని కేంద్ర జల సంఘం తెలిపింది.
మరోవైపు వరదల కారణంగా అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో పాత ఢిల్లీ కూడా ఉన్నందున నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటికను వాడొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఫోర్స్కు చెందిన 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం పనిచేస్తున్నాయి. రెండు రోజులుగా దేశ రాజధానిలో భారీ వర్షాలు పడనప్పటికీ, హర్యానా నుండి విడుదలవుతున్న కారణంగా యమునాలో ఉప్పొంగడం నదికి సమీపంలో నివసించే ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. వరదల నేపథ్యంలో అనేక మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.












Click it and Unblock the Notifications