యోగిని దెబ్బకొట్టేందుకు: ఏకమవుతున్న అఖిలేష్, బెహెన్జీ..
బీజేపీని ఎదుర్కొనే కూటమి ఏర్పాటుకు తాను సిద్దమని అఖిలేష్ ప్రకటించారు. కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని అన్నారు. ప్రజలను మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
లక్నో: దాదాపు 14సంవత్సరాల తర్వాత ప్రాంతీయ పార్టీలను తలదన్ని ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాగా వేయగలిగింది. ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు జతకట్టి ఉంటే ఈ ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. కానీ ఆలస్యంగానైనా ఈ రెండు పార్టీలు ఇప్పుడు తమ తప్పిదాలను గుర్తించాయి.
అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్బంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ప్రకటనకు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సై అన్నారు. దీంతో భవిష్యత్తులో ఈ ఇద్దరు కలిసి బీజేపీని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ కూటమితోనైనా తాను పనిచేయడానికి రెడీ అని మాయావతి ప్రకటించడంతో.. అఖిలేష్ సైతం అదే బాటలో నడవడానికి సన్నద్దమవుతున్నారు.
బీజేపీని ఎదుర్కొనే కూటమి ఏర్పాటుకు తాను సిద్దమని అఖిలేష్ ప్రకటించారు. కూటమిలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని అన్నారు. ప్రజలను మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అదే సమయంలో ఈవీఎంలను టాంపరింగ్ చేశారన్న మాయావతి వ్యాఖ్యలకు అఖిలేష్ మద్దతు పలికారు. ఎన్నికల సంఘం బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు.
యూపీలో యోగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని అఖిలేష్ విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని, పోలీసుల పట్ల కూడా ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు.