వందమంది యువతులు: ఎంపీ, రేప్లు జరుగుతాయని..
న్యూఢిల్లీ/కోల్కతా: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియో వెలుగు చూసింది. ఆ వీడియోలో... అల్పసంఖ్యాక వర్గాల పైన ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
లవ్ జిహాద్ కోసం ఓ వర్గం మరో వర్గానికి చెందిన ఒక యువతిని పెళ్లి చేసుకుంటే... వీరు వందమంది ఆ వర్గానికి చెందిన యువతులను పెళ్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, వీడియో వ్యాఖ్యల పైన ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఇలాంటి వాటికి దూరమని, అభివృద్ధి మంత్రమే తాము పఠిస్తామని చెప్పారు.
ఆదిత్యనాథ్ స్టార్ కంపెయినర్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఉప ఎన్నికల కోసం స్టార్ కంపెయినర్గా ఆదిత్యనాథ్తో పాటు మరో ఇద్దరిని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎంపిక చేశారు. యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీకాంత బాజపేయిని నియమించారు. సెప్టెంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. వారు ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 11 నియోజకవర్గాలలో పర్యటిస్తారు.
తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెసు పార్టీ (టీఎంసీ) శాసన సభ్యుడు ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఎంసీకి చెందిన దీపక్ హల్దార్ మాట్లాడుతూ.. భూమి ఉన్నంత వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. దీపక్ హల్దార్ వ్యాఖ్యల పైన మహిళా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.