శభాష్ యోగి.. నీ వల్లే యూపీ టాప్లో ఉందిప్పుడు -శాంతిభద్రతలు అమోఘమన్న అమిత్ షా -ఫోరెన్సిక్ సంస్థకు..
బీజేపీలో ఒకప్పుడు ప్రధాని మోదీకి గట్టి పోటీదారుగా ఉండిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కరోనా నిర్వహణ, శాంతి భద్రతల నియంత్రణలో దారుణంగా విఫలం కావడంతో ఉన్న సీటునే కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సీఎం అభ్యర్థిని కూడా మార్చబోతున్నదనే ప్రచారం వట్టిదే అనడానికి రుజువుగా పార్టీ అధిష్టానం, కేంద్ర పెద్దలు వరుసగా యోగిని, ఆయన పాలనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గత నెలలో ప్రధాని మోదీ వారణాసిని సందర్శించిన సమయంలో యోగిని ఆకాశానికెత్తగా, ఇప్పుడదే పనిని అమిత్ షా చేశారు...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. రాష్టంలో శాంతి భద్రతల పాలన, అభివృద్ధి, ప్రజా సంక్షే పథకాలను అమలు చేయడంలో యోగి సర్కార్ ముందంజలో ఉందని, శాంతి భద్రతల పరిరక్షణలో యోగి ప్రభుత్వం కృషి ప్రశంసనీయమని అన్నారు.

శాంతి భద్రతల నిర్వహణలో దేశంలోనే ఉత్తరప్రదేశ్ టాప్ స్పాట్ లో ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం లక్నోలో 'యూపీ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి షా ప్రసంగించారు. గతంలోనూ తాను యూపీలో పర్యటించానని, అప్పట్లో మహిళలకు ఏ మాత్రం భద్రత ఉండేది కాదని, ల్యాండ్ మాఫియా యధేచ్చగా భూకబ్జాలకు పాల్పడేదని, పట్ట పగలే ఘర్షణలు, పేదలపై దాడులు, కాల్పులు జరిగేవని గుర్తు చేసిన అమిత్ షా...
యోగి పాలనలో అవినీతి, అక్రమాలు, అన్యాయాలు తగ్గిపోయాయయిని, బీజేపీ వచ్చిన తర్వాత యూపీలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని, ఆ మేరకు 2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీని పార్టీ నెరవేర్చిందని కేంద్ర హోం మంత్రి అన్నారు. పథకాలను ఎవరైనా ప్రకటించవచ్చునని, కానీ వాటిని సమర్థంగా అమలు చేయాల్సి ఉందని, మధ్య దళారులు లేకుండా చూడడం, వీటి ఫలాలు ప్రజలకు సరిగ్గా అందేలా చూడడం ప్రధానమని అమిత్ షా పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సక్సెస్ సాధించిందని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధమైన పద్దతిని అనుసరిస్తాయని ఆశిస్తున్నామని అమిత్ షా అన్నారు. కాగా, కేంద్రం ఎప్పటికప్పుడు అందజేస్తున్న గ్రాంట్లు, నిధుల వల్ల తాము పలు పథకాలను సవ్యమైన రీతిలో అమలు చేయగలుగుతున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications