స్టార్ క్యాంపెయినర్ అయ్యారు ఫ్లాప్ క్యాంపెయినర్: యోగీ ప్రచారం చేసిన చోట్ల కమలం పార్టీకి షాక్
దేశంలో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రధాని మోడీ, జాతీయాధ్యక్షుడు అమిత్ షాలతో పాటు యోగీ ఆదిత్యానాథ్ కూడా స్టార్ క్యాంపెయినర్గా నిలిచారు. మోడీ తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరై ఉంటారు అని అడిగితే బీజేపీ నేతల నుంచి వచ్చే తొలి వ్యక్తి పేరు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. అయితే ఈ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా కమలం పార్టీ తరపున బరిలోకి దిగిన యోగీ ఆదిత్యనాథ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన 59శాతం ప్రాంతాల్లో అక్కడి అభ్యర్థులు వెనకంజలో ఉన్నారు.
బీజేపీ హిందుత్వవాదానికి కేరాఫ్గా నిలిచిన ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ... మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో మొత్తం 63 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. వీటిల్లో 26 స్థానాల్లో మాత్రమే బీజేపీ ప్రభావం చూపగలిగింది. అంటే 41శాతం ప్రభావం చూపింది. చత్తీస్గఢ్లో 24 ర్యాలీల్లో పాల్గొన్న ఆదిత్యనాథ్ కేవలం 8 నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగారు. 2013లో ఇక్కడ బీజేపీ 16 స్థానాలను సొంతం చేసుకుంది.
మధ్యప్రదేశ్లో 13 నియోజకవర్గాల్లో యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించగా బీజేపీ కేవలం 5 స్థానాల్లోనే ప్రభావం చూపగలిగింది. 2013లో ఇక్కడ బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది.ఇక రాజస్థాన్లో 26 స్థానాల్లో యోగీ ప్రచారం చేశారు. ఇందులో 13 స్థానాల్లో కమలం పార్టీ ప్రభావం చూపించగలిగింది. 2013లో పార్టీ ఇక్కడ 23 స్థానాల్లో గెలిచింది.
ఇక యోగీ ఆదిత్య నాథ్ తన ప్రసంగాల్లో ఎక్కువగా హిందుత్వ ప్రసంగం చేయడంతో ఓటర్లలో మరో భావన వచ్చిందని అందుకే కమలం పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని సమాచారం. రాజస్తాన్లో యోగీ ప్రసంగిస్తూ ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను హెచ్చరించారు. రాముని ఆలయంపై ఏవైనా బెదిరింపులకు పాల్పడితే వదిలేది లేదన్నారు. అంతేకాదు హనుమంతుడు దళితుడని యోగీ ప్రకటన చేయడం ఓటర్లను బీజేపీకి దూరం చేసింది. ఓ వైపు యోగీ ఆదిత్యనాథ్ మతప్రాతిపదికన ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు అదే మతఘర్షణల పేరుతో బులంద్ షెహర్లో ఓ పోలీస్ అధికారిని చంపడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.