యోగి మార్క్: స్క్వాడ్ ఇందుకు, ఆ బ్యాన్తో రూ.56 వేల కోట్ల నష్టం
యుపి సిఎంగా యోగి ఆదిత్యనాథ్ తన ముద్రను వేస్తున్నారు. రావడమే తరువాయి నిర్ణయాలు చేస్తూ వాటి అమలుకు సిద్ధపడుతున్నారు.
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో దూకుడుగా ఎన్నికల హామీల అమలులో దూసుకెళ్తున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే పాలనాతీరుపై సునిశిత ద్రుష్టి సారించారు. ప్రధానంగా విద్యార్థినులు, యువతులు, మహిళలను వేధిస్తున్న రోమియోల భరతం పట్టేందుకు పూనుకున్నారు.
సీఎం ఆదిత్యనాథ్ ఆదేశాలకు అనుగుణంగా 'యాంటీ రోమియో స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ పోలీసులు ప్రకటించారు. తొలిదశలో లక్నో జోన్ పరిధిలో గల 11 జిల్లాల పరిధిలో ఈ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు.
లక్నో జోన్ ఇన్ స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఎ సతీశ్ గణేశ్ మాట్లాడుతూ 'మహిళలు, బాలికలను ఈవ్టీజ్ చేస్తూ అశ్లీల వ్యాఖ్యలు చేస్తున్నరోమియోల ఆటకట్టిస్తాం. అందుకోసం 'యాంటీ రోమియో దళ్' స్థాపిస్తున్నాం. తొలుత లక్నో జోన్ పరిధిలో 11 జిల్లాల్లో ఈ దళం ఏర్పాటు చేస్తుంది. తప్పులు చేసే వారిపై గూండా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం' అని తెలిపారు.
యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేస్తామన్న అమిత్ షా
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తాము విజయం సాధిస్తే యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోమియోల వేధింపుల నుంచి తప్పించుకునేందుకు తల్లిదండ్రులు తమ కూతుళ్లను కళాశాలలకు పంపేందుకు వెనుకంజ వేస్తున్నారు. బాలికలు, యువతుల సంరక్షణార్థం యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటు చేస్తాం. ఇదేమీ మత పరమైన హామీ కాదు అని' ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పారు.
మీరట్ సభలో అమిత్ షా ఇలా
గత ఫిబ్రవరిలో మీరట్లో జరిగిన ప్రచార సభలో నాటి అఖిలేశ్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ మరోసారి యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటుచేస్తామని అమిత్ షా హామీనిచ్చారు. ‘యూపీలోని ప్రతి కళాశాలలోనూ యాంటీ రోమియో స్క్వాడ్ అందుబాటులో ఉంటుంది. మన బాలికలకు భద్రత కావాలి. ఈ యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటుతో బాలికలు స్వేచ్ఛగా భయం లేకుండా తమ కళాశాలలకు వెళ్లేందుకు వీలు చిక్కుతుంది' అని చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నయోగి ఆదిత్యనాథ్.. డబ్బు కోసం హిందూ యువతులపై ముస్లింలు ‘లవ్ జిహాద్' ప్రసరిస్తున్నారని ఆరోపించారు. హిందూ మహిళలను ముస్లిం పురుషులు ఇస్లాంలోకి మార్పిడి చేశారని చేసిన వ్యాఖ్యలు నాడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కబేళాలపై నిషేధం: ఖజానాకు ఏటా రూ.11,350 కోట్ల లోటు
యూపీ సీఎం ఆదిత్యానాథ్ బీజేపీ ఎన్నికల హామీల అమలుకు రాష్ట్రంలోని కబేలాలపై కొరడా ఝుళిపించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 స్థానాలు గెలుచుకుని చారిత్రక విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలులో భాగంగా చట్ట విరుద్ధమైన కబేళాల మూసివేతకు రంగం సిద్ధమవుతున్నది. తొలి రోజునే అలహాబాద్ జిల్లా పరిధిలోని రెండు కబేలాల మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక చట్టబద్ధంగా పని చేస్తున్న కబేళాలకు లైసెన్సుల పునరుద్ధరణ కూడా అనుమానమేనని అధికార వర్గాలు తెలిపాయి.
గత ఏడాది భారత్ నుంచి 13,14,158.05 మెట్రిక్ టన్నుల దున్నపోతుల మాంసం ఎగుమతి చేయగా ప్రభుత్వ ఖజానాకు రూ.26,681.56 కోట్ల ఆదాయం లభించింది. దేశంలోని 72 కబేళాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 38 ఉన్నాయి. దీని ప్రకారం యూపీ ప్రభుత్వ ఖజానాకు రూ.11,350 కోట్ల లోటు ఏర్పడనున్నది.
యూపీ ఖజానాకు ఐదేళ్లలో రూ.56 వేల కోట్ల నష్టం
ఇదే పరిస్థితి వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే రూ.56 వేల కోట్ల మేరకు యూపీ ప్రభుత్వ ఖజానా కోల్పోతుందని విశ్లేషకులు చెప్తున్నారు.యూపీ పశు సంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం 2014 - 15లో 7515.15 లక్షల కిలోగ్రాముల దున్నపోతు మాంసం, 1171.65 లక్షల కిలోల మేకమాంసం, 230.99 లక్షల కిలోల గొర్రె మాంసం, 1410.32 కిలోగ్రాముల పందిమాంసం తయారైంది. 15 ఏళ్లకు పైగా అనారోగ్యం భారీన పడిన జంతువులు, ప్రత్యేకించి దున్నలను చంపివేసేందుకు ఈ కబేళాలలో అనుమతినిస్తున్నారు.
2014 నివేదిక ప్రకారం వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివ్రుద్ది సంస్థ (ఎపిఇడిఎ) ప్రకారం మాంసం తయారీలో యూపీ వాటా 19.1 %. తర్వాతీ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 15.2%, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 10.9 % మాంసం ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. యుపి సిఎంగా యోగి ఆదిత్యనాథ్ తన ముద్రను వేస్తున్నారు. రావడమే తరువాయి నిర్ణయాలు చేస్తూ వాటి అమలుకు సిద్ధపడుతున్నారు.